ప్రజల దృష్టిలో ప్రభుత్వం అంటే ఓ నమ్మకం. ప్రభుత్వం అంటే ఓ భరోసా. ప్రభుత్వాలను నడిపే పార్టీలు మారుతుంటాయి. కానీ ప్రభుత్వం శాశ్వితం.
కనుకనే ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పత్రాలకు చట్టబద్దత ఉంటుంది. అందుకే ప్రజలు వాటికి అంత విలువ ఇస్తారు.
అయితే జగన్ పాలనలో ప్రభుత్వం అంటే జగన్, జగన్ అంటే ప్రభుత్వం అన్నట్లు మార్చేశారు. జగన్ విశాఖలో కాపురం పెడితే చాలు విశాఖ రాజధాని అయిపోయిన్నట్లే అని చెప్పడమే ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.
ఓ ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం మంచి పనులు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి. కానీ జగన్ అన్నిటిపై తన ఫోటోలు, పార్టీ రంగులు వేసుకొని ప్రజలు తనని ఆరాధించాలనుకున్నారు. రైతుల పాసు పుస్తకాలు, బస్టాపులు, డిగ్రీ సర్టిఫికెట్లు, రైతు వేదికలు, బస్టాండ్లు, బడి పిల్లలకి ఇచ్చే చిక్కీ ప్యాకెట్లు.. ఇలా ఎక్కడ చూసిన జగన్ తన బొమ్మ ఉండేలా చేశారు.
మరో విదంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలందరినీ జగన్ తన ఫోటోతో ‘మాస్ హిప్నటైజ్’ చేసి చెప్పు చేతల్లో ఉంచుకోవాలని అనుకున్నారు. కానీ జగన్ అనుకున్నది ఒకటైతే జరిగినది మరొకటి.
రైతుల పాసు పుస్తకాలపై రాజముద్రకి బదులు తన బొమ్మ వేయించుకున్నారు. భూముల రీ సర్వే పేరుతో రైతుల పొలాలలో వైసీపి రంగులు వేసిన రాళ్ళని పాతించారు.
వారసత్వం వచ్చిన తమ భూములలో ‘వైసీపి రాళ్ళు’ , పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ చూసి రైతులు ఆందోళన చెందేవారు. దానికితోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చేందుకు జగన్ ప్రయత్నించడంతో, ప్రభుత్వం పేరుతో జగన్ తమ పొలాలను కబ్జా చేయడానికి పెద్ద కుట్ర చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు భావించారు.
జగన్ ప్రచారయావతో తన ఫోటోలు వైసీపి రాళ్ళ కోసం రూ.701 కోట్లు ఖర్చు పెట్టేశారు. అదే రైతుల సంక్షేమానికి ఉపయోగించి ఉండి ఉంటే వారు లభ్ది పొంది సంతోషించి ఉండేవారు కదా?కానీ తమని దోచుకునే ప్రయత్నం చేస్తున్న అనుమానించారు. అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడబలుక్కున్నట్లు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు.
వ్యక్తి కంటే ప్రభుత్వం, సమాజం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం చాలా బలమైనవని సుదీర్గ రాజకీయ, పరిపాలనానుభవం ఉన్న సిఎం చంద్రబాబు నాయుడుకి తెలుసు. కనుక రైతుల పాసు పుస్తకాలు, బడి పిల్లల పాఠ్య పుస్తకాలు, చిక్కీ ప్యాకెట్లు మొదలు ప్రభుత్వం జారీ చేసే అన్ని పత్రాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రని ముద్రింపజేస్తున్నారు. అంతేకాదు… రైతుల భూములు కబ్జా చేయడానికి జగన్ సృష్టించిన మాయాజాలం చేదించేందుకు విచారణ జరిపిస్తున్నారు.
రైతులు కోరితే వ్యవసాయ భూములను రీసర్వే చేసి వారి యాజమాన్య హక్కులను ధృవీకరిస్తూ ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాలు అందించాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తద్వారా మళ్ళీ రైతులకు నమ్మకం, భరోసా కల్పిస్తున్నారు.




