ఓటమి ఒప్పుకోవడం, బాధ్యత వహించడం చంద్రబాబుకే చెల్లు!

Chandrababu Naidu Feels Himself Responsible For Loosing Power

ఓ రాజకీయ పార్టీ గెలుపోటములకు అనేక కారణాలు ఉంటాయి. వాటి అధినేతల సమర్ధత, విధానాలు, వ్యూహాలు, ఆలోచనా ధోరణి వంటివన్నీ కూడా ఆయా పార్టీల గెలుపోటములను ప్రభావితం చేస్తుంటాయి. ఉదాహరణకు ఏపీలో వైసీపీ, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మన కళ్ళ ముందే ఉన్నాయి.

వాటి అధినేతలు జగన్‌, కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన అహంభావం ప్రదర్శిస్తూ ప్రతిపక్షాలను చాలా చులకనగా చూసేవారు. తమ మాటే శాసనం అన్నట్లు వ్యవహరించేవారు. అభివృద్ధి విషయంలో కేసీఆర్‌ సమర్ధుడనిపించుకున్నా, అహంభావంతో తీసుకున్న నిర్ణయాలు, వ్యూహాలు బెడిసికొట్టాయి.

ADVERTISEMENT

ఇదేవిదంగా జగన్‌ కూడా అమరావతి, పోలవరం విషయంలో అహంభావంతో తీసుకున్న అనుచిత నిర్ణయాలు, అభివృద్ధికి బదులు సంక్షేమ పధకాలను ఎంచుకోవడం వలననే ఎన్నికలలో వైసీపీ ఓటమికి కారణాలుగా కనబడుతున్నాయి.

ఈ రెండు పార్టీలకు వాటి అధినేతలే బలమూ, బలహీనత కూడా. కనుక వారి తప్పొప్పులకు ఆ పార్టీలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. తమ పార్టీలు ఎందుకు ఓడిపోయాయో కేసీఆర్‌, జగన్‌లకు ఖచ్చితంగా తెలుసు.

ఓ సినిమా సూపర్ హిట్ అయితే ఆ క్రెడిట్ హీరో సొంతం చేసుకుని, ఫ్లాప్ అయితే దర్శకుడిపైకి నెట్టేసిన్నట్లే వారిద్దరూ కూడా తమ పార్టీల ఓటమిని ప్రత్యర్ధులకు ఆపాదించి తప్పుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచిందని కేసీఆర్ వాదిస్తే, ఈవీఎంల వలననే ఓడిపోయామని జగన్‌ సర్ధి చెప్పుకున్నారు.

కానీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నిన్న శాసనసభలో మాట్లాడుతూ, “2004,2019 ఎన్నికలలో టీడీపీ ఓటమికి కారణం నేనే. దానికి నాదే పూర్తి బాధ్యత,” అని చెపి ఒప్పుకున్నారు.

“అప్పుడు పనిపై ఎక్కువ దృష్టి పెట్టి పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకోలేకపోయాను. జరిగిన తప్పులు, లోపాల గురించి తెలుసుకున్నాక ఈసారి ఓ పక్క ఆర్ధిక వనరులను బ్యాలన్స్ చేసుకుంటూ ప్రజల తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యలని పరిష్కరిస్తూనే, మరోపక్క పార్టీని, ప్రజలను కూడా సమన్వయం చేసుకుంటూ నిర్ధిష్టమైన విధానాలతో ముందుకు సాగుతున్నాను.

పనులు చేయడం ఎంత ముఖ్యమో, చేసిన పనుల గురించి ప్రజలకు చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యం. అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలు, పార్టీ, ప్రజలతో సమన్వయంతో ముందుకు సాగితే మనకే విజయం కలుగుతుంది,” అని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఈవిదంగా పార్టీ ఓటమిని అంగీకరించడం, దానికి గల కారణాలు తెలుసుకొని ఆత్మవిమర్శ చేసుకొని, వాటిని సరిదిద్దుకోవడం, ఓటమికి పూర్తి బాధ్యత వహించడం చాలా హుందాగా ఉంటుంది.

అప్పుడే ఆ పార్టీలు గెలిచినప్పుడు కూడా వారు ఆ గెలుపు క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి నైతిక అర్హత పొందుతారు.

సిఎం చంద్రబాబు నాయుడు ఓటమికి బాధ్యత తీసుకున్నారు కనుక కూటమి గెలుపు క్రెడిట్ కూడా ఆయనకే దక్కుతుంది.

ADVERTISEMENT
Latest Stories