సుపరిపాలనలో తొలి అడుగు పడింది.. ఉత్సాహంగా..

Chandrababu Naidu's ‘First Step’ Gains Momentum

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

నాడు జగన్‌ బటన్ నొక్కి నిధులు విడుదల చేసి మంత్రులు, ఎమ్మెల్యేలను గడప గడపకి వెళ్ళి వాటి గురించి ప్రజలకు చెప్పమంటే చాలా మంది మొహం చాటేశారు. ఎందుకంటే, రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే విడిచిపెట్టేసి ‘సంక్షేమ పధకాలతో మీకు మేలు చేస్తున్నాం’ అని చెప్పమంటే ప్రజలు ఛీత్కరిస్తున్నారని!

ADVERTISEMENT

కానీ ఈ ఏడాది పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమత్తులు చేయించి, రోడ్లపై పేరుకు పోయిన చెత్తకుప్పలు తొలగింపజేసి, మురుగు కాలువలను శుభ్రం చేయించారు.

అమరావతి, పోలవరం పనులు మొదలుపెట్టారు. లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి పరిశ్రమలు రప్పిస్తున్నారు. జగన్‌ కంటే మెరుగ్గా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు.

ఒకటొకటిగా ఎన్నికల హామీలు అమలుచేస్తున్నారు. కనుక మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చాలా ఉత్సాహంగా ప్రజల వద్దకు వెళుతున్నారు.

ప్రజలు కూడా రాష్ట్రంలో ఈ మార్పులని చూస్తున్నారు. చేతిలో సంక్షేమ పధకాలు అందుతున్నాయి. కనుక ప్రజలు కూడా వారికి సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు.

ప్రభుత్వం-ప్రజలకు మద్య ఇదివరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు బదులు వాలంటీర్లు ఉండేవారు. కనుక ప్రభుత్వమంటే వాలంటీర్లే అనుకునే పరిస్థితి నెలకొని ఉండేది.

కానీ ఇప్పుడు స్వయంగా సిఎం చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా ప్రజలతో ముఖాముఖీ మాట్లాడుతూ వారి యోగా క్షేమాలు కనుగొంటున్నారు. స్వయంగా పింఛన్లు వగైరా లబ్ధిదారులకు అందజేస్తున్నారు.

కనుక ప్రభుత్వమే తమ చెంతకు వచ్చిందనే భావన ప్రజలలో కల్పించగలుగుతున్నారు. అందువల్లే నేడు ప్రభుత్వం తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది.

ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకొని దానిలో భాగస్వాములు అవుతుండటంతో ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ సూపర్ 6 హామీల అమలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు గురించి ప్రజలకు వివరిస్తున్నారు.

వాటికి సంబందించి కరపత్రాలు పంచిపెడుతున్నారు. అంతటితో వచ్చిన పని అయిపోయిందని అనుకోకుండా తమ ప్రభుత్వం, పాలనపై ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకుంటున్నారు.

ప్రభుత్వం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ సిఎం చంద్రబాబు నాయుడు కూడా నేడు తన కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పనిలో పనిగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories