రాజకీయాలలో ఉన్నవారికి అందరినీ కలుపుకుపోగల నేర్పు ఉండాలి. పట్టు విడుపులు తెలిసి ఉండాలి. ముఖ్యంగా అహంభావాన్ని, భేషజాలను పక్కన పెట్టగలగాలి.
అలాంటి గుణాలున్నవారు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడులా రాణించగలరు. లేనివారు కేసీఆర్, జగన్లా ఏకాకులుగా మిగిలిపోతారు. అసూయా ద్వేషాలతో అందరినీ దూరం చేసుకొని రగిలిపోతుంటారు. ఆ కారణంగా రాజకీయంగా తప్పటడుగులు వేస్తూనే ఉంటారు.
ఇందుకు తాజా ఉదాహరణగా పార్లమెంటులో అమరావతి బిల్లుకి ఒక్క వైసీపీ తప్ప ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక పార్టీలు మద్దతు పలకడాన్ని చెప్పుకోవచ్చు.
సిఎం చంద్రబాబు నాయుడు, టీడీపి మంత్రులూ అందరితో సఖ్యతగా ఉంటారు. అందరినీ కలుపుకుపోతారు. కనుకనే చంద్రబాబు నాయుడు కోరకపోయినా పలువురు ఎంపీలు అమరావతి బిల్లుకి మద్దతు పలికారు.
జగన్ బ్యాచ్ అమరావతిని వ్యతిరేకిస్తుంటే, ఆయనతో సరిసమానంగా చంద్రబాబు నాయుడుని ద్వేషించే బీఆర్ఎస్ పార్టీ కూడా రాజ్యసభలో అమరావతికి మద్దతు పలికింది. అంటే అమరావతి విషయంలో వైసీపీ మరోసారి పెద్ద పొరపాటు చేసిందని దాని మిత్రపక్షం బీఆర్ఎస్ పార్టీ చెప్పకనే చెప్పిందన్న మాట!
చంద్రబాబు నాయుడుకి సొంతంగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని, పొత్తులు లేకుండా ఎన్నికలలో గెలవలేరని జగన్తో సహా వైసీపీ నేతలు వాదిస్తుంటారు. కానీ ఆ వాదనతో తాము రాజకీయంగా ఏకాకులుగా మిగిలిపోయామని, తమతో చేతులు కలిపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే వాస్తవాన్ని వారు తెలివిగా దాచిపెడుతుంటారు.
ఇలాంటి అతిశయం కలిగిన కేసీఆర్ అంతటివాడు కూడా ఓ ఉప ఎన్నికలో గెలుపు కోసం వామపక్షాలతో పొత్తుపెట్టుకోక తప్పలేదు. కానీ మళ్ళీ అదే ఆతిశయం కారణంగానే వాటిని కాదనుకొని 2023 ఎన్నికలలో ఓడిపోయారు.
కేసీఆర్తో చేతులు కలిపేందుకు కనీసం వామపక్షాలు ముందుకు వచ్చాయి. కానీ జగన్తో? ఎవరూ ముందుకు రారు. కనుక ఆ లోపాన్ని ‘సింగిల్ సింహం’ ముసుగేసుకొని కప్పి పుచ్చుకుంటారు.
చంద్రబాబు నాయుడు పొత్తులని బలహీనతగా అభివర్ణిస్తూ తమ అసమర్ధతని, ఓటమిని కప్పి పుచ్చుకుంటారు. కానీ అందరినీ కలుపుకుపోవడమనేది గొప్ప లక్షణమని, దాని ఫలితాలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయని పార్లమెంటులో అమరావతి బిల్లుకి మద్దతు లభించడం, ఆమోదముద్ర పడటమే తాజా నిదర్శనం. ఈ విషయం ఇప్పటికైన జగన్కు అర్దమయితే మంచిదే. కానీ కాదు. కాకపోవడమే రాష్ట్రానికి, ప్రజలకు మంచిది!




