వైసీపీలో పైనుంచి క్రింద వరకు అందరూ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఎన్ని గంటలైనా అనర్గళంగా మాట్లాడగలరు. చంద్రబాబు నాయుడు-ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడగలరు. టిడిపి, జనసేనల గురించి కూడా మాట్లాడగలరు. కానీ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఎవరూ సాధికారికంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకంటే అది చాలా హెవీ సబ్జెక్ట్ కనుక.
అందుకే సాగునీటిశాఖ మంత్రి అంబటి రాంబాబు సైతం నాలుగేళ్ళుగా ‘పోలవరం డయాఫ్రామ్ వాల్వ్’నే పట్టుకొని అరగదీస్తూ, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి తాజాగా ‘బ్రో’ సినిమా కలక్షన్స్ గురించి మాట్లాడుతూ అందరికీ వినోదం పంచుతుంటారు.
చంద్రబాబు నాయుడు మళ్ళీ సిఎం జగన్మోహన్ రెడ్డికి, మంత్రి అంబటికి ప్రాజెక్టుల మీద పరీక్షలు పెట్టేందుకు జిల్లా పర్యటనలకు బయలుదేరడంతో ఆయనకు పార్టీలు ఎవరు సమాధానం చెప్పాలో తెలీని పరిస్థితి!
చంద్రబాబు నాయుడు మంగళవారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముచ్చుమర్రి, బనకచర్ల సాగునీటి ప్రాజెక్టులు సందర్శించిన తర్వాత నందికొట్కూరులో రోడ్ షో నిర్వహించారు.
ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాయలసీమ జిల్లాలకు సాగుత్రాగు నీరు అందించేందుకు టిడిపి హయాంలో రూ.12,400 కోట్లు ఖర్చుపెట్టి అనేక ప్రాజెక్టులు ప్రారంభించాము. కానీ ఈ నాలుగేళ్ళలో జగన్ ప్రభుత్వం వాటికి కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడంతో అవన్నీ శిధిలావస్థకు చేరుకొంటున్నాయి. కనీసం ప్రాజెక్టు గేట్లు కూడా మరమత్తులు చేయించలేకపోయారు. రోడ్లు కూడా వేయించలేకపోయారు. కానీ మూడు రాజధానులు కడతారట!
సిఎం జగన్మోహన్ రెడ్డికి నేను ఇదే సవాలు చేస్తున్నాను. నాతో పోటీ పడి రోజుకి 10 గంటలు పనిచేయగలవా? కనీసం గంటసేపు పనిచేయలేని నువ్వు పుట్టుకతోనే వృద్ధుడివి. అందుకే బటన్ నొక్కుతూ కాలక్షేపం చేసేస్తున్నావు. బటన్ నొక్కుతున్నా నిధులు విడుదల కానప్పుడు ఆ బటన్ నొక్కుడు సభలు దేనికి?
నీ పాలనలో నియోజకవర్గానికి ఓ సైకో తయారయ్యాడు. ఎక్కడ చూసినా అరాచకాలే. అధికారంలో ఉన్నాము కదా అని వైసీపీ సైకోలు రెచ్చిపోతే మేము అధికారంలోకి రాగానే ఒక్కొక్కరికీ తాట తీస్తాను జాగ్రత్త! పరదాల మాటున తిరిగే సిఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రగల్భాలు పలకడం దేనికి? దమ్ముంటే నాలాగ ధైర్యంగా ప్రజల మద్యకి వచ్చి మాట్లాడమని సవాల్ చేస్తున్నాను,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.



