కృష్ణా – గోదావరి (కేజీ) బేసిన్ నుంచి ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ను మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టం చేశారు. కాదూ… కూడదని… బయటకు తరలిస్తే పైపుల నుంచి గ్యాస్ ఎలా వెళ్తుందో చూస్తామని చమత్కరించారు. చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కేజీ బేసిన్ గ్యాస్, పుష్కరాలపై చర్చలు జరిపి ప్రసంగించారు.
ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గ్యాస్ను ఇతర రాష్ట్రాలకు తరలించడం వల్ల రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలు, ఫెర్రో అల్లాయిస్ యూనిట్టు, ఎరువుల కర్మాగారాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. ఇటీవల తాను ఢిల్లీ వెళ్లినప్పుడు ఇదే విషయాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వద్ద ప్రస్తావించానన్నారు. ఇక కృష్ణా పుష్కరాలపై కేంద్రం తీరు పట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు.
గతేడాది జరిగిన గోదావరి పుష్కరాల కోసం వంద కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రం, కృష్ణా పుష్కరాల కోసం ఒక్క పైసా కూడా విదిలించక పోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎంతో ప్రాధాన్యమున్న పుష్కరాలను కేంద్రం పట్టించుకోకపోవడం బాధాకరమని, పుష్కర పనులను నామినేషన్ ద్వారా కేటాయించడంపై అధికారులపై మండిపడిన బాబు, టెండర్ పిలిచి ఇవ్వాల్సిందని ప్రధాన కార్యదర్శి టక్కర్ను ప్రశ్నించారు. ఏది ఏమైనా పుష్కర పనులను ఆగష్టు 3వ తేదీకల్లా పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు.



