మూడు రాజధానులే వైసీపీ కొంపముంచనున్నాయా?

Chandrababu-Nara-Lokesh-Freedom-Walkమూడు రాజధానుల వ్యూహంతో టిడిపి, జనసేనలను రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలలో అడుగుపెట్టనీయకుండా చేద్దామని వైసీపీ అనుకొంటే రాయలసీమలోనే యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన టిడిపి యువనేత నారా లోకేష్‌కు సీమ ప్రజలు జేజేలు పలికారు. నారా లోకేష్‌ నిన్న గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు నుంచి మువ్వన్నెల జండా చేతపట్టుకొని యువగళం పాదయాత్ర చేపట్టగా ఆయన వెంట వేలాదిగా జనం నడిచారు.

ADVERTISEMENT

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్‌ రోడ్డులో జాతీయ జండా చేతపట్టుకొని సమైక్య వాక్ నిర్వహించగా రెండున్నర కిలోమీటర్ల పొడవునా వేలాదిగా జనాలు ఆయన వెంట నడిచి ఎంజీఎం పార్క్ వద్ద విజన్-2047 ప్రజంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంటే అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంద్ర జిల్లాల ప్రజలు వైసీపీ చెపుతున్న మూడు రాజధానుల కధలని నమ్మడం లేదని అర్దమవుతోంది. ఒకవేళ కర్నూలులో న్యాయరాజధాని ఏర్పడుతుందని సీమ ప్రజలు నమ్ముతున్నట్లయితే నారా లోకేష్‌కు అంత ప్రజాధారణ లభించి ఉండేదే కాదు.

కానీ న్యాయరాజధాని పేరుతో వైసీపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో తమను పావులుగా వాడుకొంటోందని సీమా ప్రజలు గ్రహించారు. అయితే వారిలో న్యాయరాజధాని పేరుతో వైసీపీ ఆశలు రేకెత్తించిందని నారా లోకేష్‌ గుర్తించారు. అందుకే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి వారి ఆకాంక్షలను గౌరవించారు. వైసీపీకి, టిడిపికి తేడా ఇదే. అందుకే సీమ ప్రజలు నారా లోకేష్‌కు జేజేలు పలికి ఆయన వెంట నడిచారు.

ఇక విశాఖ ప్రజలు తమ నగరమే రాష్ట్రానికి రాజధాని కావాలని కోరుకొంటున్నట్లయితే నిన్న చంద్రబాబు నాయుడు వెంట నడిచేవారే కాదు… విశాఖ రాజధాని చేస్తే మీకెందుకు అభ్యంతరం?అని ఆయనను నిలదీసేవారు కూడా. కానీ అలా చేయలేదు. ఆయన వెంట నడిచారు.

ఎందుకంటే నాలుగున్నరేళ్ళుగా విశాఖ రాజధాని అంటూ మభ్యపెడుతూ వైసీపీ ప్రభుత్వం కాలక్షేపం చేసిందే తప్ప రాజధాని నగరంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు ఏమీ చేయలేదనే విషయం విశాఖ జిల్లా ప్రజలు కూడా బాగానే గుర్తించారు. విశాఖ రాజధాని కావడం కంటే నగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడమే ముఖ్యమనే చంద్రబాబు నాయుడు హితోక్తులు సహేతుకంగా ఉన్నాయి కనుక!

అమరావతిని రాజధానిగా కాడన్నందుకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో ప్రజలు కూడా వైసీపీ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అందరికీ తెలిసిందే. అంతేకాదు… అమరావతి రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

రాష్ట్రంలో వైసీపీకి కంచుకోట వంటి కడప జిల్లాతో సహా ఈ మూడు ప్రాంతాల ప్రజలు కూడా టిడిపికి ఇంతగా సంఘీభావం ప్రకటిస్తుండటం గమనిస్తే వైసీపీ మూడు రాజధానుల వ్యూహం బెడిసికొట్టిందని స్పష్టమవుతోంది.

ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని టిడిపి చాలా స్పష్టంగా చెపుతోంది. దానికి ప్రజామోదం కూడా లభిస్తోంది. కనుక రాబోయే ఎన్నికలలో అదే చెప్పుకొని ప్రజలను ఓట్లు అడగబోతోంది.

కానీ వైసీపీకి సంక్షేమ పధకాలు తప్ప ప్రజలకు చెప్పుకొనేందుకు ఏమున్నాయి? ఏమి చెప్పుకొని ప్రజలను ఓట్లు అడుగగలదు? మూడు రాజధానులతో ప్రజల మద్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించడమే కాకుండా ఆ పేరుతో రాయలసీమ ఉత్తరాంద్ర జిల్లాల ప్రజలను 5 ఏళ్ళపాటు మభ్యపెట్టింది కూడా. కనుక వైసీపీ మాటలను ప్రజలు నమ్ముతారా?డౌటే!

ADVERTISEMENT
Latest Stories