కడప మహానాడులో సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ మనసులో ఉన్న ఆలోచనలు బయటపెట్టారు.
సిఎం చంద్రబాబు నాయుడు పార్టీని మరింత పటిష్ట పరుచుకొని, జనసేన, బీజేపిలతో కలిసి రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పధకాలతో ముందుకు సాగుతామని చెప్పారు.
మంత్రి నారా లోకేష్ పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తన మనసులో ఉన్న ఆలోచనలు వివరించి ముందుకు సాగుతామని చెప్పారు.
ఒక పార్టీ, ప్రభుత్వం పనితీరు ఏవిదంగా ఉందనేది కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ వైసీపీ, జగన్ పాలనతో పోల్చి చూపి వివరించడం ద్వారా దాని కంటే తమది ఎంత మెరుగైనదో ఇద్దరూ చక్కగా వివరించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యకర్తలని పట్టించుకోకుండా, పదవీ, అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరూ కూడా టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు.
మహానాడులో అదే మరోసారి చెప్పారు. కార్యకర్తల నిబద్దత, పోరాటాలు, త్యాగాలను ఈ సందర్భంగా ఇద్దరూ గుర్తు చేసుకొని వారికి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ చెప్పారు.
దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇటువంటి సందర్భాలలో పార్టీ, రాష్ట్రం, ప్రజల గురించే మాట్లాడుతుంది కనుక ఇందులో గొప్పేముంది?అని అనుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరూ తాము చెప్పిన ప్రతీ మాటని ఆచరణలో చేసి చూపించిన తర్వాతే చెపుతున్నారు. కనుక వారి మాటలకు చాలా విలువ, అర్ధం ఉంటాయి. ముఖ్యంగా పార్టీ కార్యకర్తల విషయంలో కేసీఆర్, జగన్ ఇద్దరూ కూడా చంద్రబాబు నాయుడు నుంచి చాలా నేర్చుకోవలసి ఉందనిపిస్తుంది.
మరో 40 ఏళ్ళపాటు అధికారంలో మనమే ఉంటామని, ఉండేలా మా పాలన సాగుతుందని మంత్రి నారా లోకేష్ చెప్పుకోవడం బాగానే ఉంది.
అది పార్టీ శ్రేణుల ఆత్మవిశ్వాసం పెరిగేందుకు, తమ ప్రభుత్వం, పార్టీ పట్ల ప్రజలకు సానుకూల భావనలు కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నంగా మాత్రమే చూడాల్సి ఉంటుంది తప్ప జగన్లా అతిశయ ప్రదర్శన అనుకోనవసరం లేదు.
మహానాడు సభలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల ఆశయాలు, ఆలోచనలకు వారు నిజంగానే కార్యరూపం తీసుకువచ్చి చూపించి ప్రజలను సంతృప్తి పరచగలిగితే, వారే కూటమి ప్రభుత్వానికి మళ్ళీ అధికారం కట్టబెడతారు.
అయితే కేవలం రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పధకాలతోనే ఏ పార్టీ ఎన్నికలలో గెలవలేదు.. అధికారంలోకి రాలేదని చెప్పేందుకు బిఆర్ఎస్, టీడీపీ, వైసీపీలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి. సమర్ధంగా రాజకీయాలు కూడా చేసినప్పుడే అధికారం సిద్ధిస్తుందని చెప్పేందుకు కూటమి ప్రభుత్వమే ఓ ప్రత్యక్ష సాక్ష్యం.
కనుక గతం నేర్పిన పాఠాల నుంచి నేర్చుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ ముందుకు సాగాలనుకోవడం చాలా మంచిదే. చాలా అవసరమే!




