ఇదివరకోసారి జరిగిన సభలో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని టీవీలో వార్త చూశాను. ఆ తర్వాత రెండు మూడు గంటల తర్వాత ఆయన హత్య చేయబడ్డారని తెలిసి షాక్ అయ్యాను.
కానీ ఆ సమయంలో నేను ఎన్నికల హడావుడిలో ఉన్నందున, ఆ కేసుని పోలీసులు చూసుకుంటున్నారు కదా అని పట్టించుకోలేదు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆ హత్య నేనే చేయించానంటూ టీవీలో జగన్, వైసీపీ నేతల స్టేట్మెంట్స్ చూసినప్పుడు షాక్ అయ్యాను.
వివేకా చనిపోయారనే వార్త విన్నప్పుడే నేను ఓ రెండు మూడు గంటలు సమయం కేటాయించి ఉండాల్సింది. కానీ ఆ కేసుపై నేను దృష్టి పెట్టకపోవడంతో జగన్ దానిని తమకు అనుకూలంగా మలుచుకొని ఓ కట్టుకధ అల్లేసి ప్రచారం మొదలుపెట్టేశారు.
వాళ్ళే ఆయనని చంపేసి నేనే ఆ హత్య చేయించానంటూ ఆ నేరం నాపైకి నెట్టేసి ఆరోజు సాయంత్రంలోగా మొత్తం సీన్ రివర్స్ చేసేసి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. అప్పుడే నేను ఆ కేసుపై దృష్టి పెట్టి ఉంటే ఎన్నికలలో టీడీపి ఓడిపోయి ఉండేదేది కాదనిపించంది.
కనుక జగన్ నేరాలు చేయడం, వాటిని ఇతరులకి అంటగట్టి తప్పించుకోవడమే కాకుండా వాటితోనే ఏవిదంగా పైచేయి సాధించగలరో అర్ధం చేసుకోవడానికి ఇదో కేసు స్టడీగా ఉపయోగపడుతుంది,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
ఇటీవల ఓ సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జగన్ క్రిమినల్ ఆలోచనలు మన ఊహకి కూడా అందవు. పల్నాడు పర్యటనలో తన కారు కింద పడి వైసీపీ కార్యకర్త చనిపోతే, దానినీ మనకి అంటగట్టి జగన్ ఏవిదంగా రాజకీయాలు చేశారో అందరూ చూశారు. కనుక అటువంటి క్రిమినల్ ఆలోచనలు కలిగిన జగన్ పట్ల మనమందరం మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం,” అని అన్నారు.
ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే, మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ కాగానే హటాత్తుగా జగన్, వైసీపీ సోషల్ మీడియాలో ఓ కొత్త కధ ప్రచారంలోకి తెచ్చారు.
2014-19లో సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పాలించినప్పుడు ఆయనే వేలకోట్ల మద్యం కుంభకోణం చేశారని, ఆ కేసులో బెయిల్ తెచ్చుకొని బయటపడ్డారనే కొత్త వాదన వినిపిస్తున్నారు.
ఒకవేళ చంద్రబాబు నాయుడుపై కక్ష తీర్చుకోవాలనుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు బదులు మద్యం కుంభకోణం కేసుతోనే తీర్చుకోవచ్చు. కానీ చేయలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న5 ఏళ్ళలో ఏనాడూ దాని గురించి మాట్లాడలేదు.
ఇప్పుడు పోలీసులు మద్యం కుంభకోణం కేసులో ఇంతమంది వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నా ఏనాడూ దాని గురించి జగన్, వైసీపీ నేతలు మాట్లాడలేదు. కానీ నిన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయగానే చంద్రబాబు నాయుడు కూడా మద్యం కుంభకోణం చేశారని జగన్ & కో కొత్త పాట మొదలుపెట్టారు.
అంటే జగన్ నేరాలు చేసి దొరికిపోతే ఆ నేరాలను ఇతరులకు అంటగట్టి బయటపడేందుకు ప్రయత్నిస్తారని, దాంతోనే ప్రత్యర్ధులను దెబ్బ తీస్తారని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నిజమని స్పష్టమవుతోంది కదా?




