“సమయం లేదు మిత్రమా… శరణమా… రణమా…” అంటూ నందమూరి నటసింహం బాలకృష్ణ “గౌతమి పుత్ర శాతకర్ణి” సినిమాలో పలికిన డైలాగులు అభిమానులతో విజిల్స్ కొట్టించిన విషయం తెలిసిందే. అయితే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ డైలాగ్స్ స్ఫూర్తితో అసెంబ్లీలో బాలకృష్ణ డైలాగులను వాడారు. పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీలో ఉండే ప్రతి ఒక్క సభ్యుడిని అడుగుతున్నా…
“రెండే ఆప్షన్స్… సమయం లేదు మిత్రమా… ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఆపేస్తారా… లేదా? తప్పు చేసిన వాడి తాట తీస్తానని… ప్రతిపక్షమా… సమయం లేదు… రా ముందుకు..” అంటూ చెప్పడంలో సభలోని సభ్యులు చిరునవ్వులు చిందించారు. ఇంతగా నవ్వించినా బాబు, ఆ తర్వాత ప్రతిపక్షం చేసిన ఆరోపణలు తిప్పికొడుతూ ప్రసంగించారు. తమ ప్రభుత్వమే మొదటిసారి పదవ తరగతి పరీక్షల్లో జంబ్లింగ్ పద్ధతి తీసుకొచ్చిందని, ఆ పద్ధతిపై ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేసారు.
బహుశా జగన్ ఎప్పుడూ పరీక్షలు రాయలేదేమోనని, పరీక్షల విధానం గురించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని, అసలు జంబ్లింగ్ అంటే ఏంటో మీకు తెలుసా? అని ఆయన వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు ఉండాలి కానీ, ఇలా అసత్య ఆరోపణలు చేయడానికి కాదని, జంబ్లింగ్ అంటే ఒక్క స్కూల్లో ఉండే పిల్లల్ని కంప్యూటర్ ద్వారా విభజించి నాలుగైదు స్కూళ్లకు పరీక్షలకు పంపిస్తారని, ఈ ఏడాది ఇన్విజిలేటర్లకు కూడా ఇదే విధానం తీసుకొచ్చామని, ఇంటర్ లో ప్రాక్టికల్ టెస్టులకు కూడా ఈ జంబ్లింగ్ తీసుకొచ్చామని ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేసారు.



