వర్షానికి ముందు దట్టమైన మబ్బులు కమ్ముకొన్నట్లు ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపికి వ్యతిరేక రాజకీయ వాతావరణం అలుముకొందిప్పుడు. దాని గురించి క్లుప్తంగా చెప్పుకొంటే…
· టిడిపి, జనసేనలు పొత్తులు ఖరారు చేసుకొని సీట్ల సర్దుబాట్లు చేసుకొంటున్నాయి. ఈ రెండూ కలిస్తే వైసీపి నష్టపోతుందని జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ ఆందోళన చెందుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
· గత ఎన్నికలలో కొండంత అండగా నిలబడిన కేసీఆర్, ఈసారి ఆయనే ఎన్నికలలో ఓడిపోయి మంచాన్న పడ్డారు.
· బోనులో ఉన్నా ఫులి ఫులే కనుక మన సింహం గాయపడి శస్త్ర చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్న ఆ పులిని పరామర్శించి సాయం కోరింది. మన సింహానికి ఆ పులి సాయపడుతుందో లేదో తెలీదు.
· ఎందుకంటే ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఆ గులాబీ పులి బయటకు రాకమునుపే మళ్ళీ బోనులో పెట్టేయాలని అప్పులు, శ్వేతపత్రాలు, మేడిగడ్డ అంటూ ఏవో
ప్రయత్నాలు మొదలుపెట్టేసారు అప్పుడే.
· ఇక ఆ పులిని చూసి వాతలు పెట్టుకొన్నట్లు బిఆర్ఎస్ ఓటమిని చూసి ఆందోళన చెందిన మన సింహం తన మందపైనే దాడి చేస్తూ అంతా చిందరవందర చేసేసుకొంటోంది.
· ప్పుడో జగనన్న సందించి వదిలేసిన బాణం అటు తిరిగీ ఇటు తిరిగీ ఎన్నికలకు ముందు మళ్ళీ ఏపీ వైపు శరవేగంగా దూసుకు వచ్చేస్తోంది. అది ఎక్కడ గుచ్చుకొన్నా ఆ నొప్పి, బాధ భరించడం కష్టమే. అయినా పంటి బిగువున
భరించక తప్పదేమో?
· గత ఎన్నికలలో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఈసారి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అది దేనికి దారి తీస్తుందో తెలీదు.
ఇవన్నీ కలిపి చూస్తే వైసీపి నెత్తిన కారుమబ్బులు కమ్ముకున్నట్లే కనిపిస్తున్నాయి. కనుక టిడిపి, జనసేనలు గేరు మార్చి స్పీడు పెంచాల్సిన సమయం ఇదే.
చంద్రబాబు నాయుడు గేరు మార్చారు. కానీ పవన్ కళ్యాణ్ పత్తా లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగని ఆయనేమీ సినిమాలు కూడా చేయడం లేదిప్పుడు. మరి ఏం చేస్తున్నారో?వారాహిని ప్రతీరోజూ తిప్పకపోతే (జనసేన) బ్యాటరీ డౌన్ అయిపోతుంది తెలుసు కదా?




