సంక్షేమం పెరిగింది.. సంపద కూడా పెరిగిందా?

Chandrababu Naidu Pushes Welfare Amid Pressure

ఎన్నికలలో గెలవాలంటే తప్పనిసరిగా ఆకర్షనీయమైన హామీలు ఇవ్వాలి. ఇస్తే కాస్త ఆలస్యమైనా తప్పనిసరిగా వాటిని అమలుచేయాలి. చేస్తున్నా ప్రతిపక్ష పార్టీ కాకిలా అరుస్తూనే ఉంటుంది… పొడుస్తూనే ఉంటుంది. జగన్‌ కూడా అదే చేస్తున్నారు.

జగన్‌ అరుస్తున్నారనో, పొడుస్తున్నారనో కాకపోయినాఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక సిఎం చంద్రబాబు నాయుడు వరుసపెట్టి హామీలు అమలు చేస్తున్నారు. కానీ ఆ ఎన్నికల ప్రచారంలోనే ‘సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతాం’ చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పారు.

ADVERTISEMENT

ఇప్పుడు హామీలు అమలు చేస్తున్నారు కనుక సంపద సృష్టించారా?అంటే కాదని అందరికీ తెలుసు. ఏడాదిగా దాని కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలిస్తే మరో రెండు మూడేళ్ళలో తప్పకుండా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలో చాలా మార్పు వస్తుంది.

కానీ అంతవరకు హామీలు అమలు చేయకుండా కూర్చుంటే కాకులు అరుస్తూనే ఉంటాయి. పొడుస్తూనే ఉంటాయి. ఆ కాకి గోల భరించడం ప్రభుత్వం వల్ల కాదు… ప్రజల వల్లా కాదు. పైగా ఆ కాకిగోలతో వచ్చే ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక కష్టమైనా, భారమైనా ఆ హామీలు అమలు చేస్తున్నారు.

ఇదివరకు తాను సిఎం అయినప్పుడు అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెట్టి రాజకీయాలను ఉపేక్షించానని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు.

దాని వలన 2019 ఎన్నికలలో ఎదురు దెబ్బ తిన్నామని, కనుక ఈసారి రాజకీయ కోణంలో నుంచి కూడా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ చేస్తున్నానని చెప్పారు. అందుకే ఇంత జోరుగా సాగుతున్నారని భావించవచ్చు.

‘స్త్రీ శక్తి’ పేరుతో ఈనెల 15 నుంచి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నారు. దీని వలన ప్రభుత్వం ఏడాదికి రూ.1950 కోట్లు భారం పడుతుంది.

ఇదికాక ఇంతవరకు అమలుచేసిన వాటి భారం, ఇకపై అమలుచేయబోయే వాటి భారం కూడా మోయక తప్పదు. ఇంకా సంపద సృష్టించబడలేదు కనుక మళ్ళీ ఈ భారాన్ని పన్నులు, ఛార్జీల పెంపు రూపంలో ప్రజలపైనే వేస్తే అప్పుడు కూడా కాకులు అరుస్తాయి.. పొడుస్తాయి.

జగన్‌ 5 ఏళ్ళు సంక్షేమ పధకాలు అమలు చేశారని ప్రజలు నెత్తిన పెట్టుకోలేదు. పెట్టుకుంటారని జగన్‌ అనుకున్నారు. కానీ 11 సీట్లతో ఇంటికి సాగనంపారు. కనుక సంక్షేమ పధకాలతో ప్రజలను మెప్పించలేమని రుజువు అయ్యింది.

ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఎందుకు పగ్గాలు అప్పగించారంటే అభివృద్ధి ఆశించే. కనుక కూటమి ప్రభుత్వం దానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.

కానీ రాజకీయాల కోసం పధకాల అమలు తప్పదు కనుక వాటన్నిటినీ ఒకే ఏడాదిలో అమలు చేసేయాలనుకోకుండా రాబోయే రెండు మూడేళ్ళకు సర్ది ఒకటొకటిగా అమలుచేస్తే మంచిదేమో?

ADVERTISEMENT
Latest Stories