గత మూడు నాలుగు రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ, వాటికి సంబందించి ప్రతీ అంశాన్ని వివరిస్తున్నారు. రాయలసీమ, కోస్తాంద్ర, ఉత్తరాంద్ర మూడు ప్రాంతాలలో గల సాగునీటి ప్రాజెక్టులన్నిటి పరిస్థితిని సమీక్షించి చెపుతున్నారు.
తమ హయాంలో వాటి పరిస్థితి ఏమిటి? ఈ నాలుగేళ్ళ వైసీపీ పాలనలో పరిస్థితి ఏమిటో ఆయన వివరిస్తున్నారు. రాష్ట్రంలో నదులు, వివిద సీజన్లలో నీటి లభ్యత, సాగుత్రాగునీటి సౌకర్యం, ఏ ప్రాజెక్టు నుంచి ఏఏ ప్రాంతాలకు నీళ్లు పారుతాయి… ప్రాజెక్టుల గేట్లు, కాలువల పరిస్థితి ఏమిటి?
ఇలా ప్రతీ అంశం గురించి సాధికారికంగా వివరిస్తూ వాటన్నిటినీ జగన్ ప్రభుత్వం ఎందుకు పాడుబెట్టేసిందని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయినప్పుడు యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసుకొని వాటన్నిటినీ సమర్ధంగా నిర్వహించుకోవలసి ఉండగా జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంతో ఏపీకి ప్రాణాధారమైన ప్రాజెక్టులన్నీ శిధిలావస్థకు చేరుకొంటున్నాయని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వం అమరావతిని, పోలవరాన్ని, విద్యా, పారిశ్రామిక, మౌలికవసతులు తదితర రంగాలను భ్రష్టు పట్టించేసిన్నట్లే, సాగునీటి రంగాన్ని కూడా ఏవిదంగా భ్రష్టు పట్టించేసిందో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తున్నారు. ఆయన చెపుతున్న సమస్యలన్నిటినీ ఆయా ప్రాంతాలలో ప్రజలు, రైతులు రోజూ కళ్ళారా చూస్తుండటంతో వారు ఆయనతో ఏకీభవిస్తున్నారు.
కానీ ఎప్పటిలాగే వైసీపీ మంత్రులందరూ ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. నిజానికి సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడాలంటే చాలా లోతైన అవగాహన ఉండాలి. కానీ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి అంబటి రాంబాబుతో సహా మంత్రులలో ఎవరికీ ప్రాజెక్టులు, నదులు, నీటి లభ్యత, వినియోగం తదితర అంశాల గురించి పెద్దగా అవగాహన లేదు.
చంద్రబాబు నాయుడుపై సుమారు అరడజను మంది మంత్రులు మూకుమ్మడి చేస్తున్నారు. వారిలో ఏ ఒక్కరూ ఆయన అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పలేకపోతున్నారు! వారందరికీ బాగా తెలిసిన విషయం ఒకే ఒకటి. అదే… పోలవరంలో డయాఫ్రాం వాల్వ్ కొట్టుకుపోవడం మాత్రమే!
కనుక అందరూ దాని గురించే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడుతూ తమ అవగాహనారాహిత్యాన్ని ప్రదర్శించుకొంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ విషయంలో తమ ప్రభుత్వం అసమర్దతను వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
సాగునీటిశాఖ మంత్రి అంబటి రాంబాబు సరేసరి. సంక్రాంతి పండుగకు సత్తెనపల్లిలో తాను చేసే డ్యాన్సులను బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ అనుకరించడంపై “గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ! ఓడినోడి డాన్స్ కాళరాత్రి !@PawanKalyan” అని ట్వీట్స్ చేయడంలో బిజీగా ఉన్నారు.



