ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి మంత్రి హెచ్ ఆర్ పాటిల్ సమక్షంలో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటున్నారు.
వారితో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖల కార్యదర్శులు, ఇంజనీర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ముందే కేంద్రానికి లేఖ వ్రాసింది కనుక దీనిపై నేడు చర్చ జరుగుతుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి జలాల లభ్యత, పంపకాలు, వాటిపై రెండు రాష్ట్రాలలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారుల మద్య సత్సంబంధాలు ఉండటం వలన ఈ సమావేశంలో కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాలకు ఇది చాలా అవసరం కూడా.
ఢిల్లీలో జరుగుతున్న ఈ కీలక సమావేశం పట్ల ఏపీలో కూటమి పార్టీలు, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు స్వాగతిస్తున్నాయి. కానీ ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమే.
కృష్ణా, గోదావరి జలాలతో తెలంగాణలో పండే పంటల కంటే బీఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ సెంటిమెంట్’ బాగా పండించుకుంటుంది.
కనుక తమ ప్రమేయం లేకుండానే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరూ సమావేశమయ్యి నదీ జలాల పంపకాలపై మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోవడం ఆ పార్టీ జీర్ణించుకోవడం చాలా కష్టమే.
ఢిల్లీలో జరుగుతున్న ఈ కీలక సమావేశంపై జగన్కి ఏమాత్రం అవగాహన లేదు కనుక ఆసక్తి కూడా లేదు. కనుక పల్నాడు పర్యటన-రప్పరప్పా డైలాగులతో విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నుంచి అందరి దృష్టి ఆకర్షించేందుకు ఏవిదంగా ప్రయత్నించారో, అదేవిదంగా నేడు హడావుడిగా తాడేపల్లి ప్యాలస్లో ప్రెస్మీట్ పెట్టి ఢిల్లీ సమావేశం నుంచి అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేశారు.
ఇదివరకు కేసీఆర్, జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారి మద్య సత్సంబంధాలు ఉన్నందున ఈ నదీ జలాల సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలిగి ఉండేవారు. కానీ ఈ నీళ్ళ పేరుతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ పండించుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతోంది. కనుక జగన్ కూడా ఏపీ నీటి వాటాల గురించి చర్చించేందుకు ఆసక్తి చూపలేదు.
కానీ ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్య, అలాగే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మద్య సత్సంబంధాలు ఉన్నందున ఈ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించకపోయినా, కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల గురించి చర్చించి రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.




