వాస్తు, జాతకాలను బలంగా నమ్మే కేసీఆర్ రూ.4-500 కోట్లు ఖర్చు చేసి వాస్తు ప్రకారం ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. అనేక మంది ముఖ్యమంత్రులు ఉపయోగించుకున్న పాత సచివాలయంలో వాస్తు దోషాలు ఉన్నాయంటూ దానిలో అడుగుపెట్టకుండా ప్రగతి భవన్ నుంచే పరిపాలన సాగించారు.
తెలంగాణ రాజకీయాలను ప్రగతి భవన్ నుంచే శాశించారు. దేశ రాజకీయాలను కూడా అక్కడి నుంచే శాశించాలని అనుకున్నారు. కానీ సొంత రాష్ట్రంలోనే ఓడిపోవడంతో ప్రగతి భవన్ ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోక తప్పలేదు.
అటువంటి ప్రగతి భవన్లో ఆయన ఎంతో తీవ్రంగా ద్వేషించే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నేడు సమావేశం కాబోతున్నారు.
ఆయన దృష్టిలో వారివురూ చిల్లర రాజకీయ నాయకులు. అటువంటివారు తాను ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ప్రగతి భవన్ (ఇప్పుడు ప్రజా భవన్)లో నేడు అధికారికంగా సమావేశమవుతుండటం చూసి పాపం కేసీఆర్ ఎంతగా రగిలిపోతారో… లోలోన ఎంతగా ఆక్రోశిస్తుంటారో?
ముఖ్యంగా తన రాజకీయ శత్రువులిద్దరూ తన అనుమతి, ప్రమేయం లేకుండానే విభజన అంశాలపై తెలంగాణ రాష్ట్రానికి సంబందించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంటే కేసీఆర్ ఎంతగా రగిలిపోతారో ఊహించుకోవచ్చు.
కనుక వారి సమావేశంలో తీసుకునే నిర్ణయాలను తప్పుపడుతూ కేసీఆర్ స్వయంగా ప్రెస్మీట్ పెట్టి ఆ ఉక్రోషం బయట పెట్టుకోవచ్చు లేదా కేటీఆర్, హరీష్ రావుల ద్వారా విమర్శలు, ఆరోపణలు చేయించవచ్చు.




