ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి వివిధ పార్టీల నేతలతో వరుస సమావేశాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో వివిధ పార్టీల నేతలను కలవనున్న చంద్రబాబు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వారి దృష్టికి తేబోతున్నారు చంద్రబాబు.
అయితే ఒకరకంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు ఇప్పటికే తన వద్ద ఉన్న అన్ని ఆయుధాలు వాడేశారు. కేంద్రమంత్రులను ఉపసంహరించుకోవడం, ఎన్డీయే నుండి వైదొలగడం, అవిశ్వాస తీర్మాణం పెట్టడం ఇలా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించి కేంద్రం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.
అయితే దేనికి కూడా బీజేపీ ప్రభుత్వం దిగి రాలేదు. కనీసం టీడీపీ తో చర్చలు జరిపే ప్రయత్నం కూడా చెయ్యలేదు. సభ సజావుగా జరగనివ్వని ఈ తరుణంలో జాతీయ నాయకులను కలవడం కూడా పెద్దగా ఉపయోగం ఉండదనే చెప్పుకోవాలి. ఢిల్లీలో ఏమైనా మెరుపు నిర్ణయానికి చంద్రబాబు వస్తే తప్ప పెద్దగా ఈ టూర్ వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు.
మరోవైపు వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటారని ప్రకటించింది. పోటీగా టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసినా ఈ రాజీనామాల వల్ల కేంద్రం దిగి వచ్చే పరిస్థితి అయితే లేదు అనే చెప్పుకోవాలి. దీనితో ఈ ప్రత్యేక హోదా అంశం భవిష్యత్తు ఏంటో చూడాలి.



