టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురువారం జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరులో ఆర్టీసీ బస్సు ఎక్కి సామాన్య ప్రజలతో కలిసి కొత్తపేట వరకు ప్రయాణించారు.
ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడినప్పుడు వారు నిత్యావసర వస్తువులు, కూరగాయాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొని బాధపడ్డారు. కరెంట్ బిల్లులు, ఇంటిపన్ను పెంచేయడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు.
తర్వాత జొన్నాడలో వైసీపీ నేతలు భారీగా నిలువ చేసిన ఇసుక యార్డు వద్దకు వెళ్ళి పరిశీలించారు. సామాన్య ప్రజలకు ఉచితంగా అందజేయవలసిన ఇసుకను కూడా వైసీపీ నేతలు దోచుకొని అమ్ముకొని కోట్లు సంపాదించుకోతున్నారని అయినా సిఎం జగన్మోహన్ రెడ్డి నీతికబుర్లు వల్లెవేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు. కొండంత ఎత్తున నిలువచేసిన ఆ ఇసుక గుట్టల వద్ద చంద్రబాబు నాయుడు సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయనతో పాటు బండారు సత్యానందరావు, గంటి హరీష్ బాలయోగి తదితరులు కూడా ‘సెల్ఫీ ఛాలెంజ్’లో పాల్గొన్నారు.
అనంతరం రావులపాలెంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, “జగన్ పాలనలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా చెలరేగిపోతోంది. ఇదివరకు పట్టణాలలో గంజాయి సేవించేవాళ్ళను చూశాము కానీ ఇప్పుడు రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో సైతం గంజాయి సేవించేవాళ్ళు పెరిగిపోయారు. వైసీపీ నేతలు ఇసుకని దోచుకొని భవన నిర్మాణరంగంలో కార్మికులకు పనిలేకుండా చేశారు. విశాఖలో ఋషికొండను బోడిగుండు చేసేసి, ఇక్కడ గోదావరి నదిలో అక్రమంగా ఇసుక తవ్వేసుకొంటూ కొండంత ఎత్తు నిలువచేసుకొని అమ్ముకొంటున్నారు.
తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్యనిషేధం అమలుచేస్తానని చెప్పి ఇప్పుడు జె-బ్రాండ్ లిక్కర్స్ రాష్ట్రమంతటా ఏరులై పారిస్తున్నాడు. దీనికితోడు గంజాయి కూడా. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు పనులులేక మద్యం, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. బాధ్యత లేని జగన్ చేతికి రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పులఊబిలో కూరుకుపోయేలా చేశాడు. వైసీపీ నేతలందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకొంటూ కేవలం నాలుగేళ్ళలో భ్రష్టు పట్టించేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడినపెడతాము. రాష్ట్రాన్ని నిలువునా దోచుకొంటున్న వైసీపీ నేతలపై, వారి అవినీతికి సహకరిస్తున్న అధికారులపై తప్పకుండా తగిన చర్యలు తీసుకొంటాము,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు నాయుడు శుక్రవారం అమలాపురంలో పర్యటించనున్నారు. ముందుగా పట్టణంలో రోడ్ షో నిర్వహించి తర్వాత గడియార స్తంభం సెంటర్లో బహిరంగసభ నిర్వహించనున్నారు.
image.png



