జగన్ కు, తనకు ఉన్న తేడా ఏమిటో ఈ రోజు ప్రజలు గమనించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన చంద్రబాబు…. ‘జగన్ కు – నాకు, నక్కకు – నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనే విషయాన్ని’ స్వయంగా జగనే చెప్పాడని, ఆ తేడా ఏమిటో ప్రజలు నేడు చవిచూసారని ఎద్దేవా చేసారు.
భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని గవర్నర్ ను కలిసి అడ్డుకున్నవారే, ఆయనకు మంత్రి పదవి దక్కక క్షోభతో చనిపోయారని విమర్శిస్తున్నారు. నాగిరెడ్డిని క్షోభకు గురి చేసింది జగన్ కాదా? సాటి జీవి చనిపోతే పక్షులు, పశువులు సైతం తమ సానుభూతి చూపుతాయి. కానీ, జగన్ మాత్రం సాటి మనిషిపై సానుభూతి చూపలేకపోయారు. దివంగత నేత భూమా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియను మేము సభకు పిలవలేదు, తన తండ్రి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నందున బాధ్యతగా ఆమె వచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు.
గతంలో శాసనసభలో దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి తనపై వ్యక్తిగత దూషణలు కూడా చేశారని, తనను వైఎస్సార్ ఎంతగా అవమానించినా ఆయన చనిపోయినప్పుడు ఇంటికి వెళ్లి జగన్ను పరామర్శించానని, అనంతరం అంత్యక్రియలకు ఇడుపులపాయకు బయల్దేరానని, అయితే ట్రాఫిక్ వల్ల వెళ్లలేకపోయానని చెప్పారు. అంతేకాకుండా పులివెందులలో విజయమ్మ పోటీ చేస్తే తమ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని పేర్కొన్నారు. కాగా, వైసీపీ సభ్యులు మాత్రం సంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రవర్తించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విరుచుకుపడుతూ… వైసీపీకి, వైఎస్ కుటుంబానికి పెద్ద దిక్కుగా వ్యవహరించిన భూమా నాగిరెడ్డి మృతి చెందితే జగన్ కనీసం శ్రద్ధాంజలి కూడా ఘటించలేదని, అంతేగాక, అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెడుతుంటే హాజరు కాకుండా ఇంతవరకూ ఏ ప్రతిపక్షం చేయని తప్పు వైసీపీ చేసిందని, జగన్ ప్రవర్తన చూస్తుంటే… సమాజంలో ఇంత దారుణమైన మానసిక స్ధితి ఉన్న వ్యక్తులు కూడా ఉంటారా? అని సెటైర్లు వేసారు.



