ఏపీలో వైసీపీ, టిడిపిల అధినేతలు, వారి పార్టీలు పనిచేస్తున్న తీరుని గమనిస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ‘చంద్రబాబు నాయుడికి వయసైపోయింది… ముసలోడు…’ అంటూ జగన్తో సహా వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడే తరచూ జిల్లాల పర్యటనలు చేస్తూ పార్టీకి దిశానిర్దేశం చేస్తుంటారు. తరచూ ఏదో ఓ జిల్లాలో పర్యటిస్తూ రోడ్ షోలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల మద్యనే కనిపిస్తుంటారు. చంద్రబాబు నాయుడు చురుకుదనం, ఆయన పార్టీని పరుగులు పెట్టిస్తున్న తీరు చూసి వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతుంటారు.
అదే…యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కుడు సభలకు మాత్రమే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు వస్తుంటారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శనివారం కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం సమీపంలోని అచ్చంపేటలో టిడిపి జోన్-2 సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో ఉభయగోదావరి జిల్లాలలోని 5 లోక్సభ, 36 శాసనసభ నియోజకవర్గాల టిడిపి ఇన్ఛార్జ్లు, పార్టీ ముఖ్యనేతలతో పార్టీ పరిస్థితిని సమీక్షించి వారికి దిశానిర్దేశం చేస్తారు.
ఈ సమావేశంలో టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, జోన్-2 టిడిపి ఇన్ఛార్జ్ ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, బండారు సత్యనారాయణమూర్తి, జ్యోతుల నవీన్, చిన్న రాజప్ప, ఎస్విఎస్ఎన్ శర్మ తదితరులు పాల్గొనబోతున్నారు.
జగన్ ముఖ్యమంత్రి కనుక ఆయనకు చాలా పని ఒత్తిడి ఉంటుంది. కనుక ఆయన చంద్రబాబు నాయుడులా నిత్యం ప్రజల మద్య తిరగలేరని వైసీపీ నేతలు సమర్ధించుకోవచ్చు.
కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు కూడా టిడిపి నేతలతో పోటీ పడలేకపోతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఈ నెల 1 నుంచి ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్కు గ్యారెంటీ’ పేరుతో మరో ప్రజాచైతన్య కార్యక్రమం మొదలుపెట్టడమే. అక్టోబర్ 15 వరకు సాగే ఈ కార్యక్రమంతో 45 రోజుల పాటు టిడిపి నేతలు, కార్యకర్తలు ప్రజల మద్యనే ఉండబోతున్నారు.
అదే… వైసీపీ నేతలు కనీసం గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా ఇష్టపడరు. వారిలో చాలామంది ఏసీ గదులలో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిపక్ష నేతలను తిట్టిపోయడానికే పరిమితం అవుతుంతారు. అప్పుడూ ఏ మంత్రి కూడా తన శాఖకు సంబందించి విషయాల గురించి మాట్లాడరు. కనీసం తమ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిద సంక్షేమ పధకాల గురించి కూడా మాట్లాడరు. బహుశః వారికి వాటి గురించి కూడా పూర్తి అవగాహన ఉండి ఉండకపోవచ్చు.
టిడిపి, వైసీపీ అధినేతలు, వారి పార్టీల పని తీరులో కూడా ఈ తేడాలను గమనిస్తే, వచ్చే ఎన్నికలలో ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారో అర్దం చేసుకోవచ్చు.



