హైకోర్టులో విచారణ జరగకముందే తాను దాఖలు చేసిన పిటిషన్ పై తనకు కావాల్సిన సమాధానం ‘సిట్’ నుండి హీరోయిన్ ఛార్మికి లభించేసిందా? అంటే అవుననే సమాధానమే వ్యక్తమవుతోంది. బలవంతంగా బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్ళు సేకరించడాన్ని ప్రశ్నిస్తూ ఛార్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ, సిట్ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరగనుంది.
అయితే తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అకున్ సబర్వాల్ దీనిపై స్పందిస్తూ… ఇప్పటివరకు బలవంతంగా ఎవరివీ సేకరించలేదని, విచారణకు వచ్చిన వారు అంగీకరించిన తర్వాత మాత్రమే వారికి సంబంధించినవి తీసుకున్నామని, అది కూడా వారు వ్రాతపూర్వకంగా ఇచ్చిన తర్వాత మాత్రమేనని స్పష్టం చేసారు. దీంతో ‘బలవంతపు సేకరణ’ అన్న ప్రశ్నకు తావు లేకుండా చేసారు అకున్. అదే విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామని, అప్పుడు కోర్టు ఎలా ఆదేశిస్తే ఆ పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసారు.
ఇప్పటివరకు సాగుతున్న విచారణ సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలు లోబడే జరుగుతోందని, ఏ ఒక్క విషయంలో కూడా చట్టవిరుద్ధంగా వెళ్లలేదని స్పష్టత ఇచ్చారు. ఇక హీరోయిన్ల విచారణకు వస్తే, వారు అంగీకరించిన ప్రదేశంలో అయినా ప్రశ్నించడానికి సిద్ధమని వ్రాతపూర్వకంగా నోటీసులలో చెప్పామని, అయితే ఒక హీరోయిన్ తండ్రి ఇక్కడికే వస్తామని వ్రాతపూర్వకంగా ఇచ్చారని ఛార్మికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే రేపు పిటిషన్ విచారణలో కోర్టు ఖచ్చితంగా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాల్సిందే అని చెప్తే ఛార్మి పరిస్థితి ఏం కానూ?



