ఈయనకి ఎవరైనా చెప్పండర్రా… శల్యసారధ్యం చేయొద్దని

Chegondi Venkata Harirama Jogaiahపవన్‌ కళ్యాణ్‌ గత ఎన్నికలలో తన కాపుకులం పేరు చెప్పుకోకుండా పోటీ చేసి ఎదురుదెబ్బ తిన్నారు. కనుక ఈసారి నిర్మొహమాటంగా పదేపదే, “నేను కాపునని’ చెప్పుకొంటూ కాపుల మద్దతు కోరుతున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగా హరిరామ జోగయ్యని ముందుంచుకొని సాగుతున్నారు.

అయితే జోగయ్యే పవన్‌ కళ్యాణ్‌కు శల్యసారధ్యం చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్న మాటలు పార్టీ శ్రేణులను గందరగోళపరుస్తుండటమే కాక, జనసేనను ఏవిదంగా టిడిపికి దూరం చేసి దెబ్బ తీద్దామా అని ఎదురుచూస్తున్న వైసీపీకి జోగయ్యే ఆయుధాలు అందిస్తున్నారు. ఆయన మాటలు టిడిపితో పొత్తులను చెడగొట్టేలా ఉన్నాయి.

ADVERTISEMENT

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అవ్వాలంటే జనసేన 175 సీట్లకు పోటీ చేయాలి. అలాగైతేనే పవన్‌ కళ్యాణ్‌ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగలుగుతారు. ఒకవేళ టిడిపితో కలిస్తే వైసీపీ ఓటమి ఖాయం. కానీ టిడిపితో పొత్తు పెట్టుకోవాలంటే తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పవన్‌ కళ్యాణ్‌ షరతు పెట్టాలి. మంత్రి పదవులతో సరిపెట్టుకోకూడదు. ముఖ్యమంత్రి పదవిపై చంద్రబాబు నాయుడు హామీ ఇస్తేనే టిడిపితో పొత్తులు పెట్టుకోవడం మంచిదని నేను పవన్‌ కళ్యాణ్‌కు చెపుతున్నాను. ఒకవేళ జనసేన బిజెపిలు కలిసి పోటీ చేస్తే మోడీ చరిష్మా, అందదండలు పవన్‌ కళ్యాణ్‌కు లాభిస్తాయి. జనసేన బలం గతంలో కంటే చాలా పెరిగింది. కనుక ఈసారి జనసేన ఒంటరిగా పోటీ చేసినా గెలవగలదని భావిస్తున్నాను. కనుక జనసేన ఒంటరిగా పోటీ చేయడమే మంచిదని నా అభిప్రాయం,” అని హరిరామ జోగయ్య అన్నారు.

హరిరామ జోగయ్య కాపులలో పెద్దవారు కనుక ఆయన జనసేనకు కాపుల ఓట్లు పడేందుకు తోడ్పడతారని పవన్‌ కళ్యాణ్‌ భావిస్తుంటే, ఆయన పవన్‌ కళ్యాణ్‌ ఏవిదంగా నడుచుకోవాలో పాఠాలు చెపుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఆయన నుంచి ఆశిస్తున్నది ఇది కాదని ఆయనకు అర్దమయ్యేలా చెప్పకపోతే ఆయన శల్యసారధ్యంతో జనసేన రధం యుద్ధంలో దిగకముందే క్రుంగిపోయే ప్రమాదం ఉంటుంది.

పవన్‌ కళ్యాణ్‌కు తన బలం ఏమిటో, తన పార్టీ బలం ఏమిటో తెలుసు కనుకనే ఈసారి ఒంటరి పోరాటం చేసి వీరమరణం పొందాలనుకోవడం లేదని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేసి వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమని చెపుతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి పదవి కోరుకోవడం తప్పు కాదు. కానీ ఒకసారి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరి తన లేదా తన పార్టీ నేతల శక్తి సామర్ధ్యాలు నిరూపించుకొని, తమ పార్టీ ఆశయాలను అమలుచేసి చూపించి ప్రజల మన్ననలు పొందగలిగితే, అప్పుడు ప్రజలే పవన్‌ కళ్యాణ్‌కు పట్టంకడతారు. కానీ జోగయ్య వంటివారి మాటలు పట్టుకొని నేనే ముఖ్యమంత్రిని అని పదేపదే చెప్పుకొంటే, మరోసారి వీరమరణం తప్పదు. టిడిపి, జనసేనలు నష్టపోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా తీవ్రంగా నష్టపోతుందని మరిచిపోకూడదు. కనుక పవన్‌ కళ్యాణ్‌ వాస్తవ రాజకీయ పరిస్థితులను, పార్టీల బలాబలాలను, రాష్ట్ర భవిష్యత్‌ని అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగడం మంచిది.

ADVERTISEMENT
Latest Stories