బీఆర్ఎస్‌ బంపర్ ఆఫర్: ఒకేసారి 28మంది రాజీనామా!

BRS MLA Kaushik Reddy Throws Kaleshwaram Challenge to Revanth Reddy

తెలంగాణలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పార్టీల మద్య కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు నిలువ చేసి ఎత్తిపోయడంపై జరుగుతున్న వాదోపవాదాలు క్లైమాక్స్ చేరుకున్నాయి.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌లలో నీళ్ళు నింపితే అవి కూలిపోయి వాటి దిగువనున్న భద్రాచలంతో సహా 44 గ్రామాలు కొట్టుకు పోతాయని సిఎం రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు.

ADVERTISEMENT

ఇలాంటి సమయంలో బీఆర్ఎస్‌ పార్టీ ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. హుజురాబాద్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేడు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “మీరు కన్నెపల్లి పంపులు ఆన్‌ చేసి అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌లలో నీళ్ళు నింపండి. ఆ రెండింటిలో ఎ ఒక్కటి ఒక్క ఇంచ్ దెబ్బ తిన్నా మా 28 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తాం. మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయబోము కూడా.

మా ఎమ్మెల్యేలు రెండు బ్యారేజీల దగ్గర కూర్చుంటారు. ఏదైనా జరిగితే మేము పూర్తి బాధ్యత వహిస్తాము. కనుక దమ్ముంటే మీరు వాటిలో నీళ్ళు నింపండి,” అని సిఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు.

కౌశిక్ రెడ్డి సీనియర్ నేతలతో కలిసి బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఇలాంటి సవాలు విసరడం వ్యక్తిగతం కానే కాదు. పార్టీ అధిష్టానం ఆదేశం, వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ సవాలు విసిరారని భావించవచ్చు.

తద్వారా సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెపుతున్నవి నిజమని నిరూపించుకోవాలి. లేకుంటే వారిద్దరూ అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతు, రైతులకు నీళ్ళు అందకుండా చేస్తున్నారనే బీఆర్ఎస్‌ నేతల వాదనలను ప్రజలు నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది.

రెండు బ్యారేజీలు కూలిపోతే బీఆర్ఎస్‌ పార్టీ పూర్తి బాధ్యత తీసుకుంటానని ప్రకటించింది కనుక వాటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం బీఆర్ఎస్‌ పార్టీ చెల్లించేలా లిఖితపూర్వకంగా హామీ కూడా కోరవచ్చు.

ఒకవేళ సిఎం రేవంత్, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇద్దరూ చెపుతున్నట్లు అవి కూలిపోయే ప్రమాదం ఉందని భావిస్తే ముందుగానే 44 గ్రామాలలో ప్రజలను తరలించి రెండు బ్యారేజీలలో పూర్తి స్థాయిలో నీళ్ళు నింపవచ్చు.

ఒకవేళ అవి కూలిపోతే ఈ రెండు బ్యారేజీల కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ హయంలో అవినీతి జరిగిందని ప్రజలకు నిరూపించి చూపవచ్చు. ముఖ్యంగా ఒకే దెబ్బకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావులతో 28 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయక తప్పదు.

రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం కమీషన్ వేసినా కేసీఆర్‌, హరీష్‌ రావులను ఇంత వరకు టచ్‌ చేయలేకపోతోంది. కనుక బీఆర్ఎస్‌ పార్టీ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ తీసుకుంటే తాడో పేడో తేలిపోతుంది కదా?

ADVERTISEMENT
Latest Stories