ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేయడం అవసరమే. కానీ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వోద్యోగాలు సాధ్యం కాదు. కనుక ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థల ఏర్పాటు చాలా ముఖ్యం. నిజానికి వాటి ద్వారానే అత్యధిక శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయి.
కనుక ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు మాత్రమే కాదు వాటికి అవసరమైన మౌలికవసతులతో పారిశ్రామికవాడల ఏర్పాటు బాధ్యతని ప్రైవేట్ రంగానికి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానపరమైన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రానికి అనేక భారీ, మద్య తరహా పరిశ్రమలు రాబోతున్నాయి. వాటికి అనుబంధంగా చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. కనుక రూ. 1,722.88 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన 8 సంస్థలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అవి సొంత పెట్టుబడితో నెల్లూరు, చిత్తూరు, పల్నాడు, కృష్ణ అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలలో మొత్తం 4,196.55 ఎకరాలు భూసేకరణ చేసి పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నాయి.
వాటిలో నెల్లూరు జిల్లాలో ‘ఇఫ్ కో కిసాన్ సెజ్’ రూ.870 కోట్లు పెట్టుబడితో 2,776.23 ఎకరాలలు, జేఎస్డబ్ల్యూ సంస్థ రూ. 531.36 కోట్లు పెట్టుబడితో విజయనగరం జిల్లాలో 1,163.43 ఎకరాలలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయబోతున్నాయి.
ఈ సరికొత్త విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. తాజాగా అనుమతించిన ఈ ప్రాజెక్టులలో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా కనీసం 70 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నూతన విధానంలో మంచి చెడులు లేదా లాభనష్టాలు క్రమంగా తెలుస్తాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే దీనిని మరింత విస్తరించి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.




