ఇంతకాలం చిరంజీవి తమవైపు ఉన్నాడన్నట్లు వైసీపీ నేతలు చెప్పుకొంటూనే పవన్ కళ్యాణ్ను నోటికి వచ్చిన్నట్లు తిడుతుండేవారు. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్ వైపు మొగ్గుచూపితే వైసీపీ నష్టపోతుందనే భయంతోనే చిరంజీవిని తమవైపు ఉన్నాడని చెప్పుకొంటున్నారు తప్ప చిరంజీవిపై నిజంగా గౌరవం ఉన్నందున కాదు. ఉంటే ఆయన సిఎం జగన్ ముందు చేతులు జోడించేలా చేసి ఆ ఫోటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేసేవారే కాదు.
అయితే తాను వైసీపీ వైపు ఉన్నాననే వారి వాదనలు, భ్రమలను చిరంజీవి ఒకే ఒక్క చిన్న విమర్శతో చిరంజీవి పూర్తిగా తొలగించేశారు. జగన్ ప్రభుత్వ అసమర్ధ పాలన గురించి చిరంజీవి చాలా సున్నితంగా విమర్శలు చేసినప్పటికీ, ఆయన చెప్పిన అంశాల గురించి మాట్లాడకుండా వైసీపీ మంత్రులందరూ కట్టకట్టుకొని చిరంజీవి మీద ఎదురుదాడి చేశారు.
అయితే చిరంజీవికి ధీటుగా సమాధానం చెప్పాలనే అత్యుత్సాహంతో అందరూ పోటాపోటీగా ఎదురుదాడి చేసి చిరంజీవి కూడా వైసీపీకి వ్యతిరేకమని స్వయంగా వారే చాటింపు వేసుకొన్నట్లయింది. అంతేకాదు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ వేర్వేరు కాదు ఒక్కటే అనే అభిప్రాయం కూడా వైసీపీ నేతలే కలిగించారు. మెగా అభిమానులకు, ముఖ్యంగా… పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది? వైసీపీ ఏ కాపు సామాజికవర్గం కోసం ఇంతకాలం చిరంజీవిని తమవాడని చెప్పుకొందో ఇప్పుడు వారిని కూడా దూరం చేసుకొన్నట్లయింది.
వైసీపీ ఎపుడూ ఏదో వ్యూహం అమలుచేస్తూ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నానని అనుకొంటుంది. చిరంజీవితో కూడా అలాగే వ్యవహరించింది. అయితే ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేకపోవడం వలననే దాని వ్యూహాలు ఈవిదంగా బెడిసికొడుతుంటాయి.
ఉదాహరణకు చిరంజీవిని తమవైపు ఉండాలని కోరుకొన్నట్లయితే, ఆయన సినీ పరిశ్రమ ప్రముఖులతో సిఎం జగన్ ఇంటికి వచ్చినప్పుడు వారితో గౌరవంగా వ్యవహరించి, చిరంజీవి చేసిన సూచనలు, అభ్యర్ధనలు అన్నిటిపై సానుకూలంగా స్పందించవచ్చు. చిరంజీవి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి సినీ పరిశ్రమకు సంబందించి సమస్యల పరిష్కారానికి జగన్ ప్రభుత్వం తోడ్పాటు అందించవచ్చు.
చిరంజీవికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధ్యాన్యం ఇస్తోందనే విషయం తెలియజేసేందుకు ఇంకా అనేకమార్గాలున్నాయి. కానీ అవేవీ చేయకుండా చిరంజీవి మాతోనే ఉన్నారని చెప్పుకొంటూ, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి, సినీ పరిశ్రమ గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూనే ఉన్నారు.
ఈ వ్యూహమే ఇప్పుడు బెడిసికొట్టడమే కాకుండా రాబోయే ఎన్నికలలో జనసేనకు చిరంజీవి మద్దతు ఇవ్వబోతున్నారనే భావన కల్పించి మెగా అభిమానులు అందరినీ ఏకంచేశారు కూడా. కనుక రాజకీయాలు వద్దే వద్దనుకొన్న చిరంజీవి చేత రాజకీయాల గురించి మాట్లాడేలా చేసింది వైసీపీ నేతలే అని చెప్పక తప్పదు.
ఆయన సద్విమర్శలను సానుకూలంగా స్వీకరించి వాటి కోసం కృషి చేస్తామని చెప్పుకొన్నా హుందాగా ఉండేది. కనీసం కాస్త సమయం తీసుకొని ఆచితూచి స్పందించినా బాగుండేది. కానీ వెంటనే అందరూ కలిసి చిరంజీవిపై ఎదురుదాడి చేసి ఆయన చెప్పిన ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలందరి దృష్టిపడేలా చేసుకొన్నారు.
అలవాటులో పొరపాటుగా అందరూ నోరుజారేశారు కనుక ఇప్పుడు వాటిని వెనక్కు తీసుకోలేరు. జరిగిన నష్టాన్ని సరిదిద్దుకోలేరు కూడా. కనుక చిరంజీవితో మొదలుపెట్టిన యుద్ధాన్ని కంటిన్యూ చేయక తప్పదు. చేస్తే వైసీపీ ఇంకా నష్టమే తప్ప లాభం ఉండదు. వైసీపీ అనుకొన్నది ఏమిటి జరిగింది ఏమిటి? డామిట్ కధ ఇలా అడ్డం తిరిగిందేమిటి?



