ఇదేం మెగా సిత్రం? చిరంజీవి వచ్చారు… తమ్ముడు రాలేదు!

Chiranjeevi Pawan Kalyan Alluri sitaramaraju statue inagurationప్రధాని నరేంద్రమోడీ కొద్ది సేపటి క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవం సందర్భంగా కాళ్ళ మండలం పెద అమిరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల ఎత్తైన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరిస్తారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడం చాలా ఆశ్చర్యకరం. చిరంజీవి కనీసం బిజెపికి చెందినవారు కూడా కాదు. 2014 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి-బిజెపి-జనసేనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. అటువంటి వ్యక్తిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT

చిరంజీవి జగన్ ప్రభుత్వ వైఖరిని, దాని అపరిమిత అధికారాలను బాగానే అర్ధం చేసుకొన్నారు. ఏపీలో తన సినిమాలు సజావుగా ఆడాలంటే జగన్ కరుణాకటాక్షాలు చాలా అవసరమని గ్రహించారు. కనుకనే తన ప్రతిష్టని, పరపతిని అన్నిటినీ పక్కనపెట్టి సినీ పరిశ్రమలో ప్రముఖులను వెంటబెట్టుకొని వచ్చి సిఎం జగన్మోహన్ రెడ్డి ముందు చేతులు జోడించి వేడుకొన్నారు.

తద్వారా చిరంజీవి ఆయన ఆహాన్ని సంతృప్తి పరిచగలిగారు. కనుకనే జగన్ ప్రభుత్వం చిరంజీవిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఉండవచ్చు. ప్రధాని నరేంద్రమోడీని కలిసేందుకు అవకాశం కూడా ఉంటుంది. కనుక పిలవగానే చిరంజీవి ఈ కార్యక్రమానికి వచ్చారని భావించవచ్చు. చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీ తరపున ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదు.

ఈ కార్యక్రమానికి తనను కూడా ఆహ్వానించారని జనసేనాని పవన్ కళ్యాణ్‌ తెలియజేశారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానించినా ఆయన హాజరు కాలేదు! ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ సినిమాలోని ఓ పాపులర్ డైలాగ్‌ గుర్తుకొస్తుంది. అదే… ‘నాకో తిక్కుంది దానికో లెక్కుంది..’

నిత్యం జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఇప్పుడు ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇష్టంలేకపోయి ఉండవచ్చు. ఇక పొత్తులు విషయంలో ఇటీవల పవన్ కళ్యాణ్‌ ‘మూడు ఆప్షన్స్’ ప్రకటించారు. మొదటి ఆప్షన్‌లో జనసేన-టిడిపి-బిజెపిలు మళ్ళీ కలిసి పనిచేయడం. కానీ ఈ ఆప్షన్‌పై బిజెపి స్పందించలేదు.

కనుక ఒకవేళ బిజెపి కలిసిరాకపోయినా వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశ్యంతో టిడిపితో పొత్తులకి సిద్దం అన్నట్లు పవన్ కళ్యాణ్‌ సంకేతాలు ఇస్తున్నారు. కానీ జనసేనతో పొత్తులు కావాలంటే అందరూ తగ్గాలని సూచిస్తున్నారు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నట్లు పదేపదే చెపుతున్నారు. అది వేరే విషయం. ఏది ఏమైనప్పటికీ భేషజాలకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్‌ ఈ కార్యక్రమానికి హాజరై ఉండి ఉంటే ఎంతో హుందాగా ఉండేది.

ADVERTISEMENT
Latest Stories