‘మా సినీ అవార్డుల’ పేరుతో ప్రతి సంవత్సరం ‘మా’ టీవీ ఛానల్ అవార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా అవార్డుల వేడుకలకు విచ్చేయని హీరోలు, హీరోయిన్లు కూడా ఈ అవార్డులకు మాత్రం విచ్చేస్తుంటారు. దీనికి గల కారణం కూడా బహిరంగమే. ఈ ఛానల్ లో మెగాస్టార్ చిరంజీవికి, కింగ్ నాగార్జునకు వాటాలు ఉండడంతో, ఈ అవార్డుల వేడుకను దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు. ప్రతి ఏడాది ఇలాగే జరుగుతుంది. కానీ, ఈ ఏడాది మాత్రం ‘మా సినీ అవార్డుల’ పేరును ‘మెగా సినీ పండుగ’గా మార్చివేసారన్న విమర్శలను మూటకట్టుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమాకు భారీ హైప్ సృష్టించుకోవడంలో భాగంగా ఈ ‘మెగా భజన వేదిక’ అదేలెండి… ‘మా సినీ అవార్డుల వేడుక’ సాగిందని సినీ పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే… ఈ ‘మెగా భజన’లో ఎక్కడా పవన్ కళ్యాణ్ ‘నామస్మరణ’ లేకుండా జాగ్రత్తపడడం గమనించదగ్గ విషయం. అంటే పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ వేడుక సాగిందని, అందుకు అనుగుణంగానే అతిధులను ఆహ్వానించడం కూడా జరిగిందన్న విమర్శలు సర్వత్రా వినపడుతున్నాయి.
మెగాస్టార్ గొప్ప స్థాయి నటుడే. అందులో మరో అభిప్రాయానికి తావు లేదు. అయితే సినీ పరిశ్రమకు చెందిన ఎందరో భాగస్వామ్యులు కాబడి జరుపుకోవాల్సిన పండుగను, ఒక వ్యక్తికి అంకితం చేసినట్లుగా సాగిన తీరు మెగా అభిమానులకేమో గానీ, సాధారణ వీక్షకులకు మాత్రం భరించడం కష్టసాధ్యంగా మారింది. అందుకే మునుపెన్నడూ లేని విధంగా ‘మా సినీ అవార్డుల’పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంత సొంత ఛానల్ అయినా మోతాదుని మించిన ‘డబ్బా’ కర్ణకఠోరంగా ఉంటుంది కదా..! ఇప్పటికే ఈ విషయాన్ని వైఎస్ జగన్ విషయంలో ‘సాక్షి’ మీడియా నిరూపించుకుంటోంది.



