తల్లులారా.. పిల్లల్ని కనండి ప్లీజ్!

CM Chandrababu Naidu Speech At NTR District Muppala Today

ఎన్టీఆర్‌ జిల్లా ముప్పాళలో ఈరోజు బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలలో సిఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మళ్ళీ ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ జనాభా చాలా తగ్గిపోయింది. జనాభా 2.1 శాతం ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్‌ జనాభా 1.6 శాతానికి పడిపోయింది. 2030 నాటికి ఇది ఇంకా తగ్గిపోతుంది. ఇదివరకు ఇద్దరు పిల్లలు కంటే జనాభా బ్యాలన్స్ అవుతుండేది కానీ ఇప్పుడు ఇద్దరినీ కన్నా ఇంకా జనాభా తగ్గుతూనే ఉంది.

ADVERTISEMENT

కనుక ప్రతీ జంట ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిన అవసరం ఉంది. లేకుంటే రాబోయే రోజుల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా యువత సంఖ్య తక్కువగా ఉంటుంది. యువత ఉద్యోగాల కోసం బయటకు పోతే ఊర్లలో వృద్ధులే మిగులుతారు. వారు కూడా చనిపోతే ఊర్లన్నీ ఖాళీ అయిపోతాయి. కనుక ఇద్దరి కంటే ఎక్కువ మందిని పిల్లలని కనడం చాలా అవసరం,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

సిఎం చంద్రబాబు నాయుడు అంతటి వ్యక్తి పిల్లలని కనాలని చెపుతుంటే సభకు వచ్చినవారు ముసిముసినవ్వులు నవ్వుకున్నారు. కానీ ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించి ఈవిదంగా చెపుతున్నారని మేధావులకు మాత్రమే అర్దమవుతుంది.

ఒకప్పుడు చైనాలో విపరీతంగా జనాభా పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం చాలా కటినమైన ఆంక్షలు విధించడంతో చైనా జనాభా శరవేగంగా పడిపోయింది. అప్పుడు యువ జనాభా కంటే వృద్ధుల శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి, ఆంక్షలు సడలించి పిల్లల్ని కనమని ప్రోత్సాహిస్తోంది.

అయితే నానాటికీ పెరిగిపోతున్న ధరలు, స్కూలు ఫీజులు, ఉద్యోగ భద్రత కొరవడటం, ఈ కారణంగా ఆర్ధిక సమస్యలతో సతమతమవుతుండటంతో చైనాలో యువ జంటలు ఇప్పుడు పిల్లలు కనేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌తో సహా భారత్‌లో అన్ని రాష్ట్రాలలో సరిగ్గా ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. కనుక ప్రజలకు ఆర్ధిక భద్రత కల్పించగలిగితే తప్ప ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా ప్రజలు ఒకరిద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కనరు.

భవిష్యత్‌లో జనాభా తగ్గిపోతుందని ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలని కంటే వారిని ఎలా పోషించాలి? అనే ప్రశ్నకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే సమాధానం చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories