ముఖ్యమంత్రులుగా చేసినవారిలో ప్రజలతో మమేకం అయిన వారిని వేళ్ళపై లెక్కించవచ్చు. అటువంటి వారిలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మొట్ట మొదటి స్థానంలో ఉంటారు. అందుకు మీడియాలోనే అనేక ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలుగా ఉన్నాయి.
ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరంలో సిఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా కాట్రేనికోన మండలం చెయ్యేరులో మహిళలతో కలిసి గ్రామంలో కలియ తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, భద్రతా సిబ్బంది వెంట నడువబోతే వారించి, మహిళలతో మాట్లాడుతూ గ్రామాన్ని పరిశీలించారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్ళి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుని రేపు (జూన్ 1)న ఇవ్వాల్సిన పింఛన్ రూ.4,000 ఈరోజే వారి చేతికి అందించారు.
ఆ తర్వాత గ్రామంలోనే నిర్వహించిన ప్రజావేదిక సభలో సిఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా తమతమ నియోజకవర్గాలలో గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు.
సంక్షేమ పధకాల అమలు విషయంలో ప్రతిపక్ష పార్టీ చేస్తున్న దుష్ప్రచారం నమ్మవద్దని, హామీ ఇచ్చిన ప్రతీ పదకాన్ని అమలుచేస్తామని, ఇదే వేగంతో రాష్ట్రాభివృద్ధి జరిగితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది కనుక మరిన్ని కొత్త పధకాలు అమలుచేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్యాలస్ చుట్టూ పెద్ద పెద్ద ఇనుప బ్యారికేడ్లు పెట్టించుకున్నారు. ప్యాలస్ దాటి బయటకు రావాల్సి వస్తే రోడ్డు కిరువైపులా పరదాలు కటించుకు కట్టించుకునేవారు. సభ జరిగే చోట చుట్టు పక్కల పచ్చటి చెట్లు నరికించేసేవారు. ‘నేను ఎక్కడికి పారిపోలేదు’ అంటూనే నేటికీ ప్రాణభయంతో ప్యాలస్ దాటి బయటకు రావడం లేదు.
కేసీఆర్ తనకి ప్రాణ భయం ఉందని ఎన్నడూ నోటితో చెప్పలేదు. కానీ ఆయన కూడా ప్రగతి భవన్ చుట్టూ పెద్ద పెద్ద ఇనుప బ్యారికేడ్లు పెట్టించుకున్నారు. చాలా అరుదుగా బయటకు వచ్చేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా లోనికి రానిచ్చేవారు కారు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు చాలా హాయిగా గ్రామస్తులతో కలిసి తిరుగుతున్నారు. వారి ఇళ్ళకి వెళ్ళి వారిచ్చే టీ, కాఫీలు తాగుతుంటారు.
దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులలో ఒకరైన ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఇంత నిరాడంబరంగా, ఇంత స్వేచ్ఛగా గ్రామస్తులతో కలిసి తిరుగుతుండటం చాలా విశేషమే. అసలు ఇటువంటి ఫోటోలు చూస్తేనే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
అటువంటిది సాక్షాత్ ముఖ్యమంత్రి తమ గ్రామానికి, తమ ఇంటికి వచ్చి కష్టసుఖాలు కనుక్కొని, తామిచ్చిన టీ, కాఫీలు తాగి పింఛను చేతికిచ్చి వెళుతుంటే గ్రామస్తులు ఎంత సంతోషిస్తారో కదా?
ఆయన స్పూర్తితో కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా ఈవిదంగా ప్రజల వద్దకు వెళ్ళి కష్టసుఖాలు తెలుసుకుంటే వారి పట్ల ప్రజలలో గౌరవం పెరుగుతుంది కదా?ఇది మన ప్రభుత్వం అని ప్రజలు అనుకునేలా చేయగలిగితే వారికే మంచిది కదా?




