“మా నమ్మకం నువ్వే జగనన్నా” అంటూ కొన్నివేల కోట్లు ఖర్చు పెట్టి జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రచార ఆర్భాటాల ఫలితాలు ముఖ్యమంత్రి బహిరంగ సభలలో దర్శనమిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి బండి మీద కూరగాయలు అమ్మే వారి మాదిరి వైసీపీ నేతలు, ఎమ్మెల్యే లు, మంత్రులు, ప్రజా ప్రతినిధులుగా తమ విధులను నిర్వహించకుండా సంచిలో “మా నమ్మకం నువ్వే జగనన్నా” అంటూ స్టిక్కర్లు వేసుకుని మరి బలవంతంగా ఇంటి గోడల మీద అంటించిన వైనం ప్రజలలో వారి ప్రభుత్వం మీద ఉన్న అపనమ్మకాన్ని సూచిస్తుంది.
ముఖ్యమంత్రి బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైసీపీ మంత్రుల మొదలు, స్థానిక వైసీపీ నేతలు, ప్రభుత్వ అధికారులు, చివరకు క్రింది స్థాయి ఉద్యోగులైనా వాలంటీర్ల వ్యధలు వర్ణనాతీతం అనే చెప్పాలి. జగన్ సభలకు హాజరు కాకపోతే లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలను రద్దుచేస్తాం అంటూ ప్రజలను బయపెట్టో, బెదిరించో వైసీపీ నేతలు బలవంతంగా అయితే జన సమీకరణ చేయగలుగుతున్నారు కానీ కనీసం జగన్ ప్రసంగం పూర్తి అయ్యేవరకు కూడా ఆసభలో తరలించిన ప్రజలను కూర్చోబెట్టలేకపోయిన దృశ్యాలు ఎన్నో మీడియాలో, సామజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతున్న వైనం జగన్ పై జనం నమ్మకాన్ని ప్రశ్నిస్తుంది.
అటు ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని మొదలుపెట్టడం.., ఇటు జనం జారుకోవడం..,అటు అధికారులు వారిని నిలువరించడానికి ప్రయత్నించడం..,ఆ ఆదేశాలను ప్రజలు బేఖాతరు చేయడం ఇవన్నీ కూడా చట్టం తన పని తానూ చేసుకుపోతుంది అన్న తీరుగా అలా ఫ్లోలో జరిగిపోవడం జగన్ ప్రభుత్వం పై జనాల నమ్మకాన్ని తెలియచేస్తుంది. గుర్రాన్ని బలవంతంగా చెరువు దగ్గరకు తీసుకురాగలం కానీ నీళ్ళు తాగించలేం కదా! అదే మాదిరి నయానో భయానో జన సమీకరణ చేయొచ్చు కానీ ప్రజల నమ్మకాన్ని పొందలేము అనేది వైసీపీ నాయకులు ఎప్పటికి గ్రహిస్తారో!
జగన్ ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలు ఆకాశాన్ని తాకుతాయి కానీ పథకాల అమలు మాత్రం పాతాళంలో ఉంటాయి. చెప్పే మాటలో నిజాయితీ చేసే పనిలో నిబద్దత ఉంటే ప్రజలే తమ ఓటు అనే స్టిక్కర్ తో తిరిగి అధికారాన్ని అందిస్తారు. ప్రభుత్వ విధానాలతో ప్రజల నమ్మకాన్ని పొందలేకాని ప్రభుత్వాలే నన్ను నమ్మాలి అంటూ స్టిక్కర్లు అతికించుకోవడం ప్రచార ఆర్భాటానికి పరాకాష్టే అవుతుంది.ఇలా బలవంతపు నమ్మకాలు ఏంతో కాలం నిలబడవు అనేది జగన్ బహిరంగ సభలలో “మాకు నమ్మకం లేదు దొర”.., అంటూ బయటకు పరుగులుపెడుతున్న ప్రజలతోనే తేటతెల్లమవుతుంది.



