నేడు టీచర్స్ డే సందర్భంగా సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఉపాధ్యాయులను అభినందిస్తూ “భవిష్యత్ తరాలను సమున్నతంగా తీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వర్తిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను అమలు చేస్తూ, ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా మన పేదింటి పిల్లలను సుశిక్షితులుగా తయారు చేయడంలో ధృడసంకల్పంతో కృషి చేస్తున్న టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు. ఉపాధ్యాయవృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా నివాళులు” అని ట్వీట్ చేశారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ట్విట్టర్లో ఉపాధ్యాయులను ఉద్దేశ్యించి, “భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది. వారి నిస్వార్ధ సేవలకు విజయసాయి రెడ్డి కృతజ్ఞతలు. నెల్లూరు, అన్నమయ్య, విశాఖ జిల్లాలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఏం భాస్కరరావు, సెట్టెం ఆంజనేయులు, ఎం. ఉమా గంధిలకు అభినందనలు” అని ట్వీట్ చేశారు.
మూడు నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు అయిన సుమారు 40-50 వేల మంది ఉపాధ్యాయులకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదు. దాంతో వారు అల్లాడిపోతున్నారు. వారితోపాటు మిగిలిన ఉపాధ్యాయులకు కూడా ఈ నెల ఈరోజు (సెప్టెంబర్ 5) వరకు జీతాలు పడకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కనుక ఉపాధ్యాయులందరూ మళ్ళీ నేడో రేపో డీఈవో కార్యాలయాల ఎదుట జీతాల కోసం ఆందోళనలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఓ పక్క జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే వారికి సిఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు చెప్పడం వెక్కిరిస్తున్నట్లే ఉంది.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి సంస్కరణల పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతూ వారిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, టోఫెల్, ఆన్లైన్ పాఠాలు, పాఠశాలల విలీనం వంటి నిర్ణయాలతో విద్యార్థులపై కూడా ఒత్తిడి పెంచేసింది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయోగాలతో విద్యావ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పని పేరుతో ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తూ మళ్ళీ వారికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం, వారి సేవలను కొనియాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.



