సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28 నుంచి వారం రోజుల పాటు విదేశీ యాత్రకు వెళ్ళేందుకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టుకి దరఖాస్తు చేసుకొన్నారు. ఆయన కుమార్తె హర్షరెడ్డి పారిస్లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసారు. కనుక జూలై 2వ తేదీన జరిగే స్నాతకోత్సవంలో ఆమెకు డిగ్రీ ప్రధానం చేయనున్నారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తను పారిస్ వెళ్ళేందుకు అనుమతించాలని సిఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుని అభ్యర్ధించారు.
అయితే సిబిఐ అధికారుల తరపు న్యాయవాదులు దీనిపై అభ్యంతరం తెలుపుతూ నిన్న కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈవిదంగా ఏదో ఓ కారణంతో అక్రమాస్తుల కేసుల విచారణకు హాజరుకాకుండా సిఎం జగన్మోహన్ రెడ్డికి మినహాయింపు ఇస్తుంటే కేసుల విచారణ ఆలస్యమవుతుందని కనుక ఆయనకు పారిస్ వెళ్ళేందుకు అనుమతించవద్దని సిబిఐ న్యాయవాది కౌంటర్ ద్వారా కోర్టుకి విజ్ఞప్తి చేశారు. దీనిపై సిబిఐ కోర్టు నేడు విచారణ జరిపే అవకాశం ఉంది.
రాష్ట్రంలో సామాన్య పౌరులు విదేశాలకు వెళ్ళేందుకు పాస్పోర్ట్, వీసా, విమానం టికెట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి అనుమతులు అవసరం ఉండదు. కానీ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళాలంటే ప్రతీసారి సిబిఐ కోర్టు అనుమతి తీసుకోవలసివస్తోంది. ఇది వ్యక్తిగతంగా ఆయనకు, ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు కూడా అవమానకరమైన విషయమే. కానీ అక్రమస్తుల కేసుల విచారణ ముగిసేవరకు ఈ అవమానాన్ని భరించక తప్పదు.



