కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఎక్కువ దృష్టి పెట్టి ఆయనకి ఉచితంగా పబ్లిసిటీ కల్పిస్తోందా?అంటే అవుననే అనిపిస్తోంది.
తాడేపల్లి ప్యాలస్లో కాలక్షేపం చేస్తున్న జగన్ పరామర్శ యాత్రల పేరుతో అప్పుడప్పుడు బయటకు వచ్చి పోతూ అందరి దృష్టిని ఆకర్షించగలుగుతున్నారంటే, ప్రభుత్వం ఆయన పర్యటనలకు అవసరానికి మించి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే అని చెప్పక తప్పదు.
జగన్ బయటకు వచ్చిన ప్రతీసారి ఏదో రాద్ధాంతం సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని వితండవాదం చేస్తూనే ఉన్నారు.
తన కారు కింద వైసీపీ కార్యకర్త సింగయ్య పడి చనిపోతే, అతనిని అంబులెన్సులో హత్య చేశారన్నట్లు సింగయ్య బార్య చేత చెప్పించడం, ప్రభుత్వం తనకు రోప్ పార్టీతో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించకపోవడం వల్లనే చనిపోయాడని వాదించడం, తనకు భద్రత కల్పించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం వంటివి చూస్తున్నప్పుడు జగన్ రాజకీయాలు ఏవిదంగా ఉంటాయో అర్దమవుతుంది.
జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించవలసి ఉన్నప్పటికీ, తన హెలికాఫ్టర్ దిగేందుకు పోలీసులు అనుమతించడం లేదని హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఆ కేసుపై విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది. ఈ కేసు ద్వారా తాను ప్రజల మద్య తిరగనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందనే జగన్ వాదనని అందరి దృష్టికి తీసుకు వెళ్ళగలిగారు కదా?
ఆ పర్యటన సంగతి తేలక మునుపే జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్ యార్డులో రైతులతో మాట్లాడేందుకు బయలుదేరుతున్నారు.
తమ నాయకుడికి కూటమి ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినప్పటికీ తప్పకుండా బంగారుపాళెంలో పర్యటిస్తారని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
జగన్, వైసీపీ నేతలని నిశితంగా గమనించినట్లయితే వారు ఓ వ్యూహం ప్రకారం ఈవిదంగా ప్రభుత్వ ప్రతిష్ట మంట గలిసేలా చేస్తున్నారని అర్దమవుతుంది.
కనుక వారి కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రతివ్యూహం ఆలోచించి అమలు చేసే బదులు, జగన్కి.. ఆయన పర్యటనలకు అవసరానికి మించి ప్రాధాన్యం ఇస్తూ, కూటమి ప్రభుత్వం కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది కదా?
నాడు నారా లోకేష్ యువగళం పాదయాత్రని అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నించినపుడు, దాని వలన నారా లోకేష్కే ఎక్కువ ఫోకస్ లభిస్తోందని గ్రహించగానే ఆయనకు దూరంగా ఉండిపోయింది.
కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆదేవిదంగా జగన్ పర్యటనలకు దూరంగా ఉంటూ, తమ కార్యక్రమాల స్పీడు పెంచితే సరిపోతుంది కదా?




