ప్రముఖ హాస్య నటుడు అలీ ఇంతకాలం వైసీపి మద్దతుదారుగా, జగన్ ప్రభుత్వానికి సలహాదారులలో ఒకరిగా ఉండేవారు. కానీ ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇకపై తాను ఏ పార్టీలో చేరనని, ఇకపై సినిమాలకే పరిమితమవుతానని చెప్పారు. తాను రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాలలోకి రాలేదని ఆనాడు రామానాయుడు ప్రోత్సాహంతో వచ్చానని చెప్పారు. రాజకీయాలలో ఉంటే మరింతగా సామాజిక సేవా కార్యక్రమాలు చేయగలననే ఆలోచనతోనే ఇంతకాలం రాజకీయాలలో ఉన్నాను తప్ప పదవులు, అధికారం కోసం కాదని అలీ చెప్పారు.
అయితే ఏనాటికైనా ఎమ్మెల్యే అనిపించుకోవాలని అలీ చిరకాల వాంఛ గురించి అందరికీ తెలుసు. టిడిపిలో ఉండగా ఆ కల నెరవేరకపోవడంతో వైసీపిలో చేరి నెరవేర్చుకోవాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇక అది నెరవేరే అవకాశం కూడా లేదని అలీ తొందరగానే గ్రహించి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారనుకోవచ్చు.
అయితే ఆయన జగన్ని నమ్ముకునే బదులు తనతో ఎంతో స్నేహంగా ఉండే పవన్ కళ్యాణ్ని నమ్ముకుని ఉంటే నేడు ఆయన పరిస్థితి మరోలా ఉండేది కదా?అనిపించకమానదు.
ఈసారి జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించి తొలిసారిగా ప్రభుత్వంలో భాగస్వామి కూడా అయ్యింది. కనుక ఒకవేళ అలీ పవన్ కళ్యాణ్పై నమ్మకముంచి జనసేనలో చేరి ఉండి ఉంటే ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యేవారు. అప్పుడు ఈవిదంగా తల దించుకుని కాకుండా స్వాగర్వంగా సినీ పరిశ్రమలోకి రాగలిగేవారు. సినీ పరిశ్రమలో అపూర్వమైన గౌరవ మర్యాదలు లభించి ఉండేవి.
కానీ జగన్ని నమ్ముకోవడం వలన రాజకీయంగా నష్టపోవడమే కాకుండా, సినీ పరిశ్రమతో జగన్ ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని తెలిసి ఉన్నా ఆయనతో అంటకాగడం వలన, ఆయనను ఎంతగానో అభిమానించి, ఆదరించిన సినీ పరిశ్రమకు అలీ శత్రువుగా మిగిలిపోయారు.
అయితే అలీ చేసిన ఒకే ఒక మంచి పని ఏమిటంటే, జగన్ని నమ్ముకొని పోసాని, వర్మ, రోజాలాగ రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల గురించి చెడుగా మాట్లాడలేదు.
అలీ ఎమ్మెల్యే పదవి కోసమే వైసీపిలో చేరారని సినీ పరిశ్రమలో అందరికీ తెలుసు. కనుక మళ్ళీ తిరిగివచ్చినా సినీ పరిశ్రమ ఆయనను తప్పకుండా ఆదరిస్తుందనే భావించవచ్చు. అలీ సినీ పరిశ్రమకు మళ్ళీ తిరిగి రావడం అందరికీ సంతోషమే. అయితే జగన్ని నమ్ముకొని నష్టపోయిన బాధితులలో అలీ కూడా ఒకరని తేలిపోయింది.




