ఒకప్పుడు ఏ రాష్ట్రమైన దయనీయ స్థితిలో ఉంటే బిహార్తో పోల్చి మాట్లాడేవారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటువంటి దయనీయ స్థితికి చేరుకున్నప్పుడు, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆంధ్రాతో పోల్చి మాట్లాడుతుండేవారు.
ఇదేవిదంగా రాజకీయ పార్టీల ఉత్థాన పతనాలను కూడా పోల్చి చెప్పుకుంటాము. ఆ తర్వాత ముఖ్యమంత్రులని పోల్చి చూసుకుంటాము. మంత్రులనే కాదు రాజకీయ నాయకులను కూడా పోల్చి చూసుకోక తప్పడం లేదు.
తెలంగాణలో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ మొదలవగానే అందరికీ టక్కున ఏపీలో వైఎస్ షర్మిల గుర్తొచ్చారు. మీడియాతో సహా అందరూ ఆమెతో కల్వకుంట్ల కవితని పోల్చి చూస్తూ మాట్లాడుకుంటున్నారు.
ఇందుకు వైఎస్ షర్మిల ఏమనుకుంటున్నారో తెలీదు కానీ వారిద్దరినీ పోల్చి చూడటం ఇప్పట్లో ఆగేలా లేదు.
ఒకప్పుడు ఇద్దరు చెల్లెమ్మలు అన్నలకు రాఖీలు కట్టారు. సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకొని సంతోషపడ్డారు. ఆ అన్నా చెల్లెళ్ళ బంధాలను చూసి సామాన్య ప్రజలు, ముఖ్యంగా పార్టీ క్యాడర్ కూడా చాలా సంతోషాపడేవారు.
వైఎస్ షర్మిల అన్న కోసం పాదయాత్రలు చేస్తే, కల్వకుంట్ల కవిత తండ్రి కోసం బతుకమ్మ ఆడి తెలంగాణ మహిళలను ఏకం చేశారు.
కానీ వైఎస్ షర్మిల ఆస్తులు, పదవుల కోసం అన్నతో విడిపోగా, కల్వకుంట్ల కవిత పదవులు, ప్రాధాన్యం దక్కడం లేదని అన్నతో పాటు తండ్రికి కూడా దూరం అవుతున్నారు.
కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిల ఇద్దరూ చాలా శక్తివంతమైన మహిళలే. ఇద్దరికీ మంచి వాక్చాతుర్యం, దూసుకుపోయే గుణం, అందరినీ కలుపుకుపోయే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రాజకీయాలపై మంచి పట్టుంది. ఇద్దరికీ పుష్కలంగా డబ్బు, ఆస్తులు ఉన్నాయి. రాజకీయాలలో రాణించేందుకు అన్ని అర్హతలు, లక్షణాలు ఉన్నప్పటికీ ఇద్దరూ రాఖీలు కట్టిన అన్నల చేతిలోనే మోసపోయారు… అని చెపుతున్నారు.
వైఎస్ షర్మిల సొంత కుంపటితో చేతులు కాలాయి కనుక కల్వకుంట్ల కవిత అటువంటి ప్రయోగం చేయరనే అందరూ అనుకుంటున్నారు.
ఆమె కూడా కొత్త పార్టీ పెట్టే ఉద్దేశ్యం లేదంటూనే గులాబీ కండువా,పార్టీ జెండాలు, చివరికి ఫ్లెక్సీ బ్యానర్లలో అన్న ఫోటోలు పక్కన పెట్టి జిల్లా పర్యటనలు చేస్తూ మద్దతు కూడగట్టుకుని సొంత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకవేళ కల్వకుంట్ల కవిత సొంత కుంపటి పెట్టుకుంటే అది ఏవిదంగా మండుతుందో, ఎటువంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందో, చివరికి అది ఏవిదంగా ఆరిపోతుందో వైఎస్ షర్మిల పెట్టుకున్న ఆరిపోయిన కుంపటిని చూస్తే అర్దమవుతుంది.
కనుక ఒకవేళ కుంపట్లు భరించడం కష్టమనుకుంటే ఏం చేయాలో కూడా వైఎస్ షర్మిలని చూస్తే అర్దమవుతుంది. ఆమె తెలంగాణ కాంగ్రెస్లో చేరాలనుకున్నారు. కానీ ఆమెని చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి నో చెప్పేశారు. ఆమె అదృష్టం కొద్దీ కాంగ్రెస్ అధిష్టానం అధిష్టానం ఆమెకు ఏపీ కాంగ్రెస్ని అప్పగించడంతో ప్రస్తుతానికి దాంతో కాలక్షేపం చేసేస్తున్నారు.
కల్వకుంట్ల కవిత కూడా ఆరుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి పుచ్చుకోవాలనుకున్నారని కానీ రేవంత్ రెడ్డి ఆమెకి కూడా నో చెప్పేశారని ‘గిట్టనివాళ్ళు’ చెవులు కోరుకొంటున్నారు.
కనుక కల్వకుంట్ల కవిత ఇక మిగిలింది బీజేపి. కానీ బీజేపిలో బిఆర్ఎస్ పార్టీ విలీనం పాయింటుతోనే ఆమె తండ్రి, అన్న, బావతో యుద్ధాలు చేస్తున్నారు. కనుక ఆమె స్వయంగా బీజేపి తలుపులు మూసే సుకున్నారని చెప్పవచ్చు.
కనుక ఒకవేళ కల్వకుంట్ల కవిత గులాబీ కారులో నుంచి దిగిపోతే ఏం చేస్తారో చూడాలి. ఒకవేళ ఆమె మరో కొత్త ఫార్మాట్ క్రియేట్ చేస్తే అది భవిష్యత్లో అన్న చేతిలో మోసపోయిన ఏ చెల్లికో ఉపయోగపడవచ్చు.




