యుద్ధాలు బడ్జెట్‌పైనే … కానీ నిధుల కోసం కాదు!

BRS Congress

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, బిహార్‌ రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించిన మోడీ ప్రభుత్వం తెలంగాణకు మళ్ళీ అన్యాయం చేసిందని బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌లో రాగం తీశారు.

ADVERTISEMENT

తొలిసారిగా కాంగ్రెస్‌ కూడా బిఆర్ఎస్‌కు వంతపాడుతోంది. అయితే రెండు పార్టీలు రెండు వేర్వేరు స్వరాలలో రాగాలాపన చేస్తుండటంతో ఎక్కడా సింక్రనైజ్ అవడం లేదు.

కేటిఆర్‌ రాగాలపనలో… జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇచ్చినా బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క పైసా తేలేకపోయారు. అందుకే స్వీయ అస్తిత్వత్వం (అంటే కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండటం అనుకోవాలన్న మాట) చాలా ముఖ్యం. కేసీఆర్‌ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలరు. ఆయనకు మాత్రమే రాష్ట్రం పట్ల నిబద్దత ఉంది. కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ వేస్ట్… తెలంగాణకు పనికిరావు,” అని కేటీఆర్‌ రాగ తాత్పర్యం (సారాంశం).

దీనికి తెలంగాణ కాంగ్రెస్‌ కూడా ట్విట్టర్‌లో ప్రతి రాగం తీస్తూ, “పదేళ్ళు పాలించారు. ఓ సారి 11, మరోసారి 9 ఎంపీ సీట్లు ఇస్తే మోడీ పాదాలను ‘గులాబీ’ పూలతో పూజించారు తప్ప తెలంగాణకు ఏం సాధించారు?

టిఆర్ఎస్‌ వద్దు… బిఆర్ఎస్‌ ముద్దు అన్నప్పుడు మీ స్వీయ అస్థిత్వం ఎక్కడకు పోయింది? తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని ఇతర రాష్ట్రాలలో పంచి నేతలను కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ స్వీయ అస్తిత్వం మరిచిపోయారా? బయ్యారం, ఖాజీపేట సాధించగలిగారా?తెలంగాణ కోసం మీరు చేసిందేమిటి? పీకిందేమిటి? అనేది కాంగ్రెస్‌ రాగ తాత్పర్యం.

కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు రెండూ తెలంగాణకు తీరని అన్యాయం జరిగిపోయిందని కన్నీళ్ళు కారుస్తూనే పరస్పరం కత్తులు దూసుకోవడం చూస్తే, రాష్ట్రానికి జరిగిన నష్టం కూడా వాటికి రాజకీయ ఆయుధమే అవుతుందని… దాంతో అవి పోరాడుకోగలవని స్పష్టమవుతోంది.

కేసీఆర్‌ తన స్వీయ అస్థిత్వం కోసమే మోడీపై కత్తులు దూస్తూ తెలంగాణ కోసం పోరాడుతున్నానని చెప్పుకునేవారు. కానీ కేసీఆర్‌ అలా కత్తులు దూయడం వలననే తెలంగాణకు దక్కాల్సినవి దక్కలేదు. అంటే కేసీఆర్‌ చేసిన పోరాటాలతో ఆయనే కాదు… తెలంగాణ కూడా నష్టపోయిందన్న మాట!

కాంగ్రెస్‌, బీజేపీలు ఎప్పుడూ కొట్లాడుకుంటూనే ఉంటాయి. కానీ తొలిసారిగా రేవంత్‌ రెడ్డి పార్టీ గీత దాటి మోడీని ‘పెద్దన్న’ అంటూ పొగిడినా తెలంగాణకు బడ్జెట్‌లో పైసా విదిలించలేదు.

అయితే అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్విందనే బాధ అన్నట్లు మోడీ ఇవ్వనందుకు కాదు కేటీఆర్‌ దెప్పుతున్నందుకే కాంగ్రెస్‌ ఎక్కువ బాధపడుతోంది.

బిఆర్ఎస్ పార్టీ కూడా మోడీ తెలంగాణకు నిధులు కేటాయించనందుకు బాధపడటం లేదు… కాంగ్రెస్‌, బీజేపీలను దెప్పేందుకు అవకాశం దొరికినందుకు సంతోషపడుతున్నట్లుంది.

ADVERTISEMENT
Latest Stories