ఇటీవల రాజమండ్రి సమీపంలో రోడ్ ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల చనిపోతే, ఆయనని ఎవరో ఎక్కడో హత్య చేసి శవాన్ని తెచ్చి అక్కడ పడేసి రోడ్ ప్రమాదంలో చనిపోయిన్నట్లు చిత్రీకరిస్తున్నారంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
అయితే పోలీసులు కూడా దీనిని రోడ్ ప్రమాదం కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు తప్ప హత్య కోణంలో చేయడం లేదని, పాస్టర్ హత్య చేయబడ్డారని చెప్పడానికి తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని హర్ష కుమార్ చెప్పారు. పోలీసుల తీరుకి నిరసనగా ఆయన ధర్నా కూడా చేశారు.
ఇది రోడ్ ప్రమాదమని స్పష్టంగా తెలుస్తున్నా హత్య అంటూ హర్షకుమార్ ఆరోపిస్తూ ఓ మతం వారిని మరొక వర్గానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీసులు ఆయనపై సెక్షన్స్ 196,197 కింద కేసు నమోదు చేసి, తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆయన విచారణకు హాజరయ్యారు. కానీ ఎటువంటి సాక్ష్యాధారాలు చూపలేకపోయారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలకు న్యాయం చేయాలని కోరితే, పోలీసులు నాపైనే కేసు నమోదు చేశారు. ఆయన మద్యం మత్తులో బండి నడపడం వలననే ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు అబద్దాలు చెపుతున్నారు.
నేను కేసులకు భయపడను. ఇన్ని రోజులైనా పోలీసులు ఆయన శవ పరీక్ష నివేదికని ఎందుకు బయటపెట్టలేదు?ఒకవేళ ఏపీలో పోలీసులు ఆ నివేదికని బయటపెట్టకపోతే తెలంగాణ పోలీసులను ఆశ్రయించి మళ్ళీ శవ పరీక్ష చేయిస్తాను,” అని హర్ష కుమార్ అన్నారు.
చనిపోయింది పాస్టర్ కనుకనే ఇది చాలా సున్నితమైన వ్యవహారంగా మారింది. కనుక పోలీసులు కూడా అంత జాగ్రత్తగా అన్ని కోణాలలో దర్యాప్తు జరిపి ఇది కేవలం రోడ్ ప్రమాదమని స్పష్టం చేసే సీసీ ఫుటేజీలని మీడియాకు విడుదల చేశారు.
ఆయన రోడ్ ప్రమాదంలో మరణించారని శవ పరీక్షలో నిర్ధారణ అయిన తర్వాత ఆయన మద్యం తాగారనే విషయం నివేదికలో పేర్కొని దానిని బయటపెడితే చనిపోయిన ఆయనని ఇంకా అగౌరవ పరిచిన్నట్లవుతుందని పోలీసులు భావించి దానిని బయట పెట్టకపోయి ఉండొచ్చు. కానీ హర్ష కుమార్ ఈ విషయం బయటపెట్టడం తప్పు. పైగా పోలీసులను నిందిస్తుండటం ఇంకా తప్పు. హర్ష కుమార్ రాజకీయాలలో చురుకుగా పాల్గోవడం లేదు. కనుక ఇటువంటి సున్నితమైన వ్యవహారాలపై రాజకీయాలు చేయడం దేనికి?ఎవరి కోసం?




