మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరిన ప్రకారం నేటి నుంచి ప్రతీరోజూ ఇంటి నుంచి భోజనం వస్తోంది. మొదటిరోజు ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్వయంగా భోజనం క్యారేజ్ జైలుకి తెచ్చి ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోంది. ప్రజా ప్రతినిధులకు బొత్తిగా గౌరవం ఇవ్వడం లేదు. వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని తప్పుడు కేసులు సృష్టించి ఈవిదంగా వేదిస్తున్నారు. మేము న్యాయపోరాటం చేస్తాము,” అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మిథున్ రెడ్డికి ప్రతీ రోజూ ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు కోర్టు అనుమతించింది కనుక ఇక ప్రతీరోజు వైసీపీ నేతలు ఈ వంకతో రాజమండ్రి జైలు వద్ద ప్రెస్మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించక మానరు.
ఒకవేళ ఈ వెసులువ్బాటు లేకపోయినా వైసీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటారు.
నాడు మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఇదే జైల్లో నిర్బందించినప్పుడు గుర్తుకురాని, గౌరవం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలు, న్యాయవ్యవస్థలు ఇప్పుడు వైసీపీ నేతలకు గుర్తువస్తున్నాయి.
నాడు చంద్రబాబు నాయుడుని గౌరవించకపోగా శాసనసభలోనే చాలా దారుణంగా అవమానించారు. అప్పుడు వారికి తప్పుగా అనిపించలేదు. కానీ ఇప్పుడు ప్రజాప్రతినిధి మిథున్ రెడ్డిని, వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం గౌరవించడం లేదని పెద్దిరెడ్డి ఆక్రోశించడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?
గమ్మతైన విషయం ఏమిటంటే, నాడు జగన్ టీడీపి నేతలను వేధించి పైశాచిక ఆనందం అనుభావిస్తున్నందుకు ‘సైకో’ అని సంభోదించేవారు.
జగన్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుడుతూ విధ్వంసం సృష్టిస్తున్నందుకు ‘తాలిబాన్ ప్రభుత్వం’ అని విమర్శించేవారు.
ఇప్పుడు వైసీపీ నేతల నోట, సైకో, తాలిబాన్ ప్రభుత్వం వంటి మాటలు వింటుంటే వారు తమని తాము తిట్టుకుంతున్నట్లే ఉంది తప్ప కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు లేదు.






