ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జగన్ ప్రభుత్వ ఆర్ధిక అవకతవకల గురించి ఓ లేఖ ద్వారా కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేశారు. దానిలో జగన్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తుండటం, భవిష్యత్లో జరిగే మద్యం విక్రయాలను చూపించి అప్పులు తేవడం,
పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించి వాడేసుకొంటుండటం, అలాగే రాష్ట్రంలో పేదల కోసం ఇళ్ళ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తున్నా వాటిని పూర్తిచేయకపోవడం వంటి అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీ ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోగా వారు దాచుకొన్న సొమ్మును కూడా తీసి వాడేసుకోవడం వంటివి పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం పాల్పడుతున్న ఈ ఆర్ధిక అవకతవకలను తక్షణం సమీక్షించి తగు చర్యలు చేపట్టవలసిందిగా దగ్గుబాటి పురందేశ్వరి కోరారు.
అయితే కేంద్రం ఇచ్చిన గణాంకాలనే పేర్కొంటూ జగన్ ప్రభుత్వాన్ని ఆమె నిలదీస్తున్నప్పుడు, మళ్ళీ వాటినే లేఖలో పేర్కొంటూ నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కొన్ని సందేహాలు కలిగిస్తోంది.
1. ఏపీ బిజెపి అధ్యక్షురాలి హోదాలో ఆమె చేత జగన్ ప్రభుత్వంపై కేంద్రమంత్రికి లాంఛనంగా ఫిర్యాదు చేయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వానికి ఉచ్చు సిద్దం చేస్తోందా?
2. తాను మాజీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజులాగా జగన్ ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంభించబోనని తెలియజేసేందుకు ఆమె ఈవిదంగా చేస్తున్నారా?లేదా వైసీపీ ఎంపీలు కేంద్రానికి మద్దతు ఇస్తున్నందున వైసీపీ-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందనే ప్రజలలో అనుమానాలను తొలగించేందుకు ఈవిదంగా చేస్తున్నారా?
3. కేంద్రం అవసరమైనప్పుడల్లా వైసీపీ మద్దతు తీసుకొంటూ, తిరిగి దానికి అప్పులు, కేసుల విషయంలో సహకరిస్తూనే, తాము పరస్పరం కత్తులు దూసుకొని పోరాడుకొంటున్నామని ఏపీ ప్రజలను మభ్యపెట్టేందుకు, ఎన్నికల వరకు కాలక్షేపం చేసేందుకే బిజెపి అధిష్టానం సూచన మేరకే ఆమె ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారా?అనే సందేహాలు కలుగుతున్నాయి. వీటన్నిటికీ రాబోయే రోజుల్లో తప్పక సమాధానాలు లభిస్తాయి.
అయితే ఏపీ అభివృద్ధి, ఏపీ ప్రయోజనాల పట్ల బిజెపికి చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవలసి ఉంటుంది. బిజెపి తన విశ్వసనీయతను నిరూపించుకోవలసి ఉంటుంది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పరితపించిన ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇస్తారని ఆశిద్దాం.



