తెలుగు సినీ పరిశ్రమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ వైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతుంటే, మరోపక్క నిత్యం ఏవో ఒక సమస్యలు, వివాదాలతో సతమతమవుతూనే ఉంటుంది.
ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం చిన్నా పెద్ద హీరోలందరూ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయడమేనని స్వర్గీయ దాసరి నారాయణ రావు ఎప్పుడూ చెప్పారు. స్వయంగా అనేక సినిమాలు చేసి చూపారు.
ఈ ఫార్ములాని వెంకటేష్, చిరంజీవి వంటి సీనియర్ హీరోలు, అనిల్ రావిపూడి వంటి ఒకరిద్దరు దర్శకులు అర్థం చేసుకొని ఫాలో అవుతున్నారు.
కానీ మిగిలినవారిలో కొంత మంది ఒక్కో సినిమా పూర్తిచేయడానికి రెండు మూడేళ్ళు సమయం తీసుకుంటున్నారు. కానీ ఏమాత్రం తేడా వచ్చినా అంత భారీ బడ్జెట్తో అన్నేళ్ళపాటు కష్టపడి తీసిన సినిమా గంగలో కలిసిపోతుంటుంది.
ఉదాహరణకు మల్లాది వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మొదలుపెట్టినప్పుడు దానిపై చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే, చిరంజీవి, శ్రీదేవి జంటగా చేసిన సూపర్ డూపర్ హిట్ సోషియో ఫ్యాంటసీ ‘జగదేకవీరుడు, అతిలోక సుందరి’ తర్వాత ఆ స్థాయిలో వస్తుందనే!
కానీ వివిధ కారణాల వలన ఆ సినిమాని ఇన్నేళ్ళపాటు మూలపడేయడంతో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకునేవారే లేరు. కనుక ఒకవేళ ‘విశ్వంభర’ని విడుదల చేయాలనుకుంటే దానికి హైప్ సృష్టించి ప్రేక్షకులని మళ్ళీ దాంతో కనెక్ట్ చేయడం చాలా కష్టం.
ఇలా ఎక్కువ కాలం నాన్చిన లేదా షూటింగ్ చేసిన సినిమాలలో హిట్లు ఎన్ని?ఫ్లాపులు ఎన్ని?ఎందువల్ల ఫ్లాప్?అనే ప్రశ్నలకు సమాధానం అందరికీ తెలుసు.
కానీ చిరంజీవి ‘విశ్వంభర’ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చకా చకా పూర్తిచేసి సంక్రాంతికి విడుదల చేసి హిట్ కొట్టారు. అది పూర్తికాక ముందే బాబి కొల్లితో సినిమా ప్లాన్ చేసుకొని మొదలుపెట్టేశారు.
ఇక అనిల్ రావిపూడి సంగతే చూస్తే గత ఏడాది వెంకటేష్తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ కొట్టారు. దాని తర్వాత చిరంజీవితో హిట్ కొట్టారు. వెంటనే వెంకటేష్, కళ్యాణ్ రామ్లతో నేడు మరో సినిమా (పూజా కార్యక్రమం) మొదలుపెట్టేసి మళ్ళీ సంక్రాంతికి వచ్చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ దగ్గర వెంకటేష్ ఆగిపోలేదు. వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ‘ఆదర్శ కుటుంబం’ మొదలుపెట్టి పూర్తి చేసేస్తున్నారు. అది పూర్తయ్యేలోగా అనిల్ రావిపూడితో ఈ సినిమా మొదలుపెట్టేశారు.
పెద్ద హీరోలు, దర్శకులు ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు మిగిలినవారు కూడా ఇదే పద్దతిలో వేగంగా సినిమాలు పూర్తిచేయగలిగితే సినీ పరిశ్రమలో అందరికీ చేతి నిండా పని, ఆదాయం ఉంటే సమస్యలు తగ్గుముఖం పడతాయి. దాసరి నారాయణ రావు ఇదే కదా చెప్పారు.



