ఢిల్లీ కారు బాంబు ప్రేలుడులో మృతుల సంఖ్య 12కి పెరిగింది. ప్రస్తుతం భూటాన్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఈ దాడిపై తీవ్రంగా స్పందించారు. ఈ దాడిలో ఇంతమంది ప్రాణాలు బలిగొన్నవారు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. వారిపై చర్యలు తీసుకుంటామని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పహల్గాంలో పర్యటిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని వారి భార్య, పిల్లలు ఎదుటే అతికిరాతకంగా హత్య చేసినప్పుడు ప్రధాని మోడీ ఇదే విధంగా స్పందించారు. తర్వాత భారత్ ఆర్మీ ‘ఆపరేషన్ సింధూర్’ పేరు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిభిరాలను ధ్వంసం చేసింది.
పాక్ వాయుసేన స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసి చాలా నష్టం కలిగించింది. భారత్ ధాటిని తట్టుకొని నిలబడలేకపోయిన పాక్ పాలకులు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ని వేడుకొని యుద్ధం అపించుకున్నారు.
ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ఆపరేషన్ సింధూర్ మద్యలో ఆపేసినప్పటికీ, మరోసారి భారత్పై ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్ని ఈ ప్రపంచ పటంలో నుంచి తుడిచిపెట్టేస్తామంటూ భారత్ ఆర్మీ జనరల్ హెచ్చరించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఆయన అటువంటి హెచ్చరికలు చేస్తారనుకోలేము.
అలా గట్టిగా హెచ్చరించినప్పటికీ ఉగ్రవాదులు ఈసారి దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ బాంబు దాడికి చేయడం ద్వారా భారత్కు సవాలు విసిరినట్లే భావించవచ్చు.
నిన్న జరిగిన బాంబు దాడిలో పాల్గొన్న డాక్టర్ ఒమర్ మహ్మద్ తదితరులకు జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు నిఘా సంస్థలు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదివరకు ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టి, ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మధ్యలోనే నిలిపివేసినందుకు కాంగ్రెస్ మిత్రపక్షాలు ప్రధాని మోడీని చాలా తీవ్రంగా విమర్శించాయి. కనుక ఈసారి ఆపరేషన్ మొదలుపెడితే మద్యలో ఆపకపోవచ్చు.
కానీ పాకిస్తాన్కి కవచంలా ట్రంప్ ఉన్నారు. ఇదివరకు ఏం జరిగిందో చూశారు. కనుక ఈసారి అయన ఈపాటికే ప్రధాని మోడీకి బ్రేకులు వేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. కనుక ఈసారి ఆపరేషన్ కాస్త ఆలస్యం కావచ్చు లేదా సర్జికల్ స్ట్రయిక్స్తో సరిపెడతారేమో?






