గతేడాది నవంబర్ లో అర్ధంతరంగా నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించిన కేంద్రం, ఈ సారి నుండి మాత్రం కాస్త ప్లానింగ్ తో ముందుగానే ఆ విషయాన్ని ప్రజల చెవిన పడేయాలని చూస్తోంది. మునుపటి మాదిరి అర్ధంతరంగా కాకుండా, ఇక నుంచి ప్రతి మూడు నాలుగేళ్లకోసారి కొత్త నోట్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. నకిలీ నోట్ల నియంత్రణ కోసం 2 వేలు, 500 నోట్ల భద్రతా ప్రమాణాలు మార్చాలని కేంద్రం భావిస్తోంది.
నోట్ల రద్దు తర్వాత చాలా పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న పలు దేశాలు మూడు, నాలుగేళ్లకు ఒకసారి భద్రతా ప్రమాణాలను మారుస్తుంటాయి. ఇప్పుడు ఇదే విధానాన్ని మన దేశంలోనూ అమలు చేయాలని నిర్ణయించారు. ఇటీవల కేంద్ర ఆర్థిక, హోంశాఖ సీనియర్ అధికారులు, హోంశాఖ కార్యదర్శి మెహర్షీ తదితరులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నోట్ల భద్రతా ప్రమాణాల మార్పుపై చర్చించినట్టు సమాచారం.
నకిలీ నోట్ల అడ్డుకట్టకు ఇదొక్కటే మార్గమని, భద్రతా ప్రమాణాల మార్పు ద్వారా వాటికి చెక్ పెట్టవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు తర్వాత పట్టుబడిన నకిలీ నోట్లు ఎక్కువగా పాకిస్థాన్ లో ముద్రించినట్టు విచారణలో వెల్లడైంది. వీటిని బంగ్లాదేశ్ మీదుగా దేశంలోకి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. విదేశాలలో అమలులో ఉన్న ఈ విధానం వినడానికి బాగానే ఉన్నా, మన దేశంలో అమలుకు ఎంతవరకు సాధ్యపడుతుందన్న విషయం ప్రశ్నార్ధకమే.



