గత 5 ఏళ్ళ జగన్ పాలనలో వినిపించని పదం అభివృద్ధి. వినిపించిన పదాలు సంక్షేమ పధకాలు, అప్పులు, భౌతిక దాడులు, కేసులు, అరెస్టులు, గంజాయి, భూకబ్జాలు, మీడియాలో వైసీపి నేతల బూతులు!
కానీ ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక తొలిసారిగా అభివృద్ధి అనే పదం తరచూ వినిపిస్తోంది. ఆ దిశలో చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి కూడా.
మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వస్తే వైసీపి నేతల్లాగా బూతులు మాట్లాడకుండా చాలా హుందాగా మాట్లాడుతున్నారు. అందరూ తమ తమ శాఖలకు సంబందించిన విషయాలు మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా ఈ మార్పులని గమనిస్తూనే ఉన్నారు.
టిడిపి, వైసీపిల మద్య ఈ రాజకీయాలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. కనుక వాటి గురించి సామాన్య ప్రజలు ఆలోచించాల్సిన అవసరమే లేదు.
అమరావతి, పోలవరం నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి, మౌలికవసతుల అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, సంక్షేమ పధకాల అమలు, సుపరిపాలన… వీటి కోసం సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు.
అమరావతికి రూ.15,000 కోట్లు నిధులు సమకూర్చుకొని టెండర్ల ప్రక్రియకి ప్రభుత్వం సిద్దం అవుతోంది. రాష్ట్ర బడ్జెట్లో మరో రూ.3,445.33 కోట్లు కేటాయించింది.
పోలవరానికి కేంద్ర ప్రభుత్వం రూ.12,000 కోట్లు అందించబోతుండగా, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.5,445 కోట్లు కేటాయించింది. ఇప్పటికే కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో రూ.70,000 కోట్ల పెట్టుబడితో ఆర్సలర్-మిట్టల్ కంపెనీలు అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాని కోసం కొత్తగా ఓ పోర్టు కూడా నిర్మించబోతున్నాయి.
తాజాగా టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్తో సిఎం చంద్రబాబు నాయుడు నిన్న సమావేశమయ్యారు. టాటా గ్రూప్ ఏపీలో రూ.40,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిందని సిఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
టాటా పవర్ 5,000 మెగావాట్స్ సామర్ధ్యంతో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతోంది. విశాఖ టిసీఎస్ కంపెనీ కొత్తగా ఐటి డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. అలాగే టాటా గ్రూప్ ఏపీలో ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటు చేసేందుకు యోచిస్తోందని తెలిపారు.
ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల నడిబొడ్డున భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్లోగా అక్కడి నించి విమానసేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు.
జగన్ పాలనలో బాగా హైలైట్ అయిన ‘గుంతలు పడిన రోడ్ల’న్నిటినీ సంక్రాంతి పండుగలోగా పూడ్చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రోడ్లు భవనాల శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఈసారి బడ్జెట్లో రూ.9,554 కోట్లు కేటాయించారు కూడా.
సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ వైసీపి చేస్తున్న దుష్ప్రచారానికి బడ్జెట్తోనే సమాధానం చెప్పారు.
తల్లికి వందనం పధకానికి రూ.6,487 కోట్లు, అన్నదాతా సుఖీభవ పధకానికి రూ.1,000 కోట్లు, 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 ఆర్ధిక సాయం హామీ అమలుకి రూ.3,341 కోట్లు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి ఏకంగా రూ.69,437 కోట్లు కేటాయించడం ద్వారా సిఎం చంద్రబాబు నాయుడు తన నిబద్దతని నిరూపించుకున్నారు.
ఈవిదంగా జగన్ హయాంలో వినపడని, కనపడని అభివృద్ధి పనులెన్నో కేవలం ఈ నాలుగు నెలల్లోనే మొదలయ్యాయి. ఆ అభివృద్ధి జాబితా చాలా పెద్దదే ఉంది. దాని గురించి క్లుప్తంగా చెప్పుకుంటేనే ఇంతయింది!




