దిల్సుక్నగర్ బాంబు ప్రేలుళ్ళ కేసులో పట్టుబడిన ఐదుగురు దోషులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించగా ఆ తీర్పుని తెలంగాణ హైకోర్టు కూడా సమర్ధించింది. తమ ఉరి శిక్షను రద్దు చేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్ని కొట్టి వేసింది.
దిల్సుక్నగర్లో 2013, ఫిబ్రవరి 21న జరిగిన బాంబు ప్రేలుళ్ళలో 18 మంది చనిపోగా, 131 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు జరిపి ఆరుగురు దోషుల్లో ఐదుగురిని పట్టుకోగలిగింది. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న రియాజ్ భత్కల్ మాత్రం తప్పించుకు పారిపోయాడు. నేటికీ అతని ఆచూకీ కనుగొనలేకపోయారు.
పట్టుబడ్డ ఐదుగురిపై సుదీర్గ విచారణ తర్వాత హైకోర్టు నేడు ఉరి శిక్షలు ఖరారు చేసింది. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇటువంటి హేయమైన నేరాలకు పాల్పడినవారు కూడా 12 ఏళ్ళు న్యాయపోరాటాలు చేయగలిగారు!
ఇంకా సుప్రీంకోర్టు, రాష్ట్రపతి క్షమాభిక్ష వరకు చాలా తతంగం ఉంది కనుక మరో 10-12 ఏళ్ళ పాటు వారి ప్రాణాలకు ఎటువంటి ఢోకా లేదనే భావించవచ్చు!
వారి తరపున ఇన్నేళ్ళుగా న్యాయపోరాటాలు ఎవరు చేస్తున్నారు?వాటి కోసం కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు చేస్తున్నారు?ఎందుకు చేస్తున్నారు? ఆ డబ్బు ఎవరు సమకూరుస్తున్నారు?వారికీ, హంతకులకు మద్య సంబంధం ఏమిటి?అనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం, నిఘా సంస్థలకె తెలియాలి.
వంద మంది అపరాధులు తప్పించుకుపోయినా పరవాలేదు కానీ ఒక్క నిరపరాధికి పొరపాటున కూడా శిక్ష పడకూడదనే మన న్యాయశాస్త్రం చెపుతోంది. కనుక 18 మందిని బలిగొన్నవారు నిరపరాధులేమో? అని విచారణ జరిపారు. ఇంకా మరో 10-12 ఏళ్ళు జరిగినా ఆశ్చర్యం లేదు.
కానీ చిన్న చిన్న నేరాలకు, చేయని నేరాలలో జైలు పాలైన అనేక నిరుపేదలు బెయిల్ తెచ్చుకునేందుకు డబ్బులేక లేదా బెయిల్ పొందవచ్చని తెలియకపోవడం వలన ఏళ్ళ తరబడి జైళ్ళలో రిమాండ్ ఖైదీలుగా మగ్గిపోతున్నారు కదా?అది అన్యాయం కాదా? కోడికత్తి కేసులో శ్రీను 5 ఏళ్ళ పాటు జైలులో మగ్గిపోవడమే ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.
వివేకానంద రెడ్డి వంటి ప్రముఖుడి హత్యకేసులో నిందితులు అందరూ బెయిల్ పొందగలరు. సీబీఐ కూడా వారిని అరెస్ట్ చెయ్యలేదు! ఆ కేసు విచారణ ఎన్నటికీ పూర్తి కాదు. ఏళ్ళ తరబడి విచారణ కొనసాగుతుండగానే సాక్షులు అందరూ ఒకరొకరుగా చనిపోతుంటే, నిందితులు చురుకుగా రాజకీయాలలో పాల్గొంటున్నారు.
కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పొంది దర్జాగా బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే. అంటే డబ్బు, పలుకుబడి,రాజకీయ అండదండలు ఉన్నవారు ఎంత పెద్ద నేరం చేసినా తప్పించుకోగలరు. కానీ అవేవి లేనివారు జైళ్ళలో మగ్గిపోవలసిందేనన్న మాట!
దిల్సుక్నగర్ బాంబు ప్రేలుళ్ళ కేసులో పట్టుబడిన ఐదుగురు దోషులు నేటికీ న్యాయపోరాటాలు చేస్తూ శిక్షలు పడకుండా తప్పించుకోగలుగుతున్నారంటే అది మన న్యాయవ్యవస్థ బలహీనతా.. గొప్పదనమా?




