గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవ వేడుకను ఎంత వైభవంగా జరిపినప్పటికీ, అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా ఏపీ సర్కార్ పైన మరియు ఆ వేడుకకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను పైన తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న కృష్ణాపుష్కరాల ప్రారంభ వేడుకల బాధ్యతను ఏపీ సర్కార్ ఎవరికి అప్పగిస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనిపై తాజాగా దేవాదాయ శాఖ నుండి ఒక అధికారిక ప్రకటన వెలువడింది.
సందేహాలను నివృత్తి చేస్తూ… కృష్ణా పుష్కరాల సమయంలో నదీమ్మ తల్లికి హారతి ఇచ్చే దృశ్యాలను చిత్రీకరించే బాధ్యతలను మరియు హారతిచ్చే వేదిక డిజైన్ల పనులు కూడా బోయపాటి శ్రీనుకే అప్పగించినట్లు ఏపీ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. దీనికి వాయిస్ ఓవర్ ను ప్రముఖ నటుడు సాయికుమార్ అందిస్తారని తెలిపారు. గతంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో సాయికుమార్ యాంకరింగ్ బాధ్యతలను నిర్వర్తించిన విషయం తెలిసిందే.
హారతి కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు ఆదేశించినట్లుగా ప్రసాద్ తెలిపారు. పుష్కరాలు జరిగే అన్ని రోజుల్లో కనకదుర్గమ్మ, శ్రీశైలమల్లికార్జున దేవాలయాలను 22 గంటల పాటు తెరిచి ఉంచుతామని స్పష్టం చేసారు. అయితే గోదావరి ఉదంతం నేపధ్యంలో ఈ సారి ఏ విధంగా ప్రారంభోత్సవ వేడుకలు ఉంటాయోనని రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



