ఉన్న డబ్బును ఏం చేయాలో తెలియని నల్లకుబేరులు ప్రస్తుతం వాటిని తెల్లగా మార్చుకునే ప్రక్రియలకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంత బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకులలో తొలి రోజు పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయినట్లుగా సమాచారం అందడంతో మొదటి రోజు నుండే నల్ల కుబేరులు తమ టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైంది. అయితే ఎంత వైట్ చేయాలనుకున్నా… కరగని ధనం కలిగిన వ్యక్తుల కోసం సినీ దర్శకుడు దశరథ్ ఇచ్చిన ఓ సలహా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.
“నల్లధనాన్ని అధికారికంగా డిక్లేర్ చేయలేక, అలాగే వాటిని ఏం చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్న కుబేరులు, నేరుగా హాస్పిటల్స్ కు వెళ్లి అక్కడ ప్రాణాపాయ రోగాలతో బాధపడుతున్న సామాన్య వ్యక్తుల వైద్యం కోసం గానీ, అలాగే మెడిసిన్ బిల్స్ కోసం గానీ ఖర్చు పెడితే, ఆపదలో ఉన్న ప్రజలకు సహాయపడిన వారవుతారని, నిబంధనల ప్రకారం హాస్పిటల్స్ ఖచ్చితంగా పాత నోట్లను అంగీకరిస్తాయని… నల్లకుబేరులకు ఈ సందేశం చేరే వరకు సోషల్ మీడియాలో దీన్ని ప్రచారం చేయాలని” దర్శకుడు దశరథ్ అందించిన ఓ ఫెంటాస్టిక్ ఐడియాను హీరో సందీప్ కిషన్ తదితరులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
నిజమే… అవినీతి, అక్రమంగా సంపాదించిన డబ్బును కనీసం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి కోసమైనా ఖర్చు పెడితే బాగుటుందన్న ఐడియా నిజంగానే అమేజింగ్. మరి ఈ దిశగా ఒక్కరైనా అడుగులు వేస్తారా? అంటే అది ప్రశ్నార్ధకమే. అవసరమైతే చెత్త కుండీల పక్కన వదిలి వెళ్ళడానికో లేక తగలబెట్టడానికైనా మొగ్గుచూపుతారేమో గానీ మంచి కార్యాల కోసం ముందుకు రారన్న విషయం జగమెరిగిన సత్యమే. అయితే ఓ ఆద్భుతమైన సలహాను అందించి దర్శకుడు దశరథ్ మాత్రం నెటిజన్ల చేత ‘శభాష్’ అనిపించుకుంటున్నారు.



