తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోలేక పోయినప్పటికీ డీఎంకే అధినేత కరుణానిధి మాత్రం ఓ అరుదైన రికార్డులు తన సొంతం చేసుకున్నారు. వరుసగా 13 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడి, అన్ని సార్లు విజయం సాధించిన ఏకైక భారతీయుడిగా కరుణానిధి రికార్డు నెలకొల్పారు. అంటే దాదాపు 60 సంవత్సరాల నుంచి తమిళనాడు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తూ, తాజా గెలుపుతో మరో ఐదేళ్ల అవకాశాన్ని అంది పుచ్చుకున్నారన్న మాట. పోటీ చేసిన అన్ని శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కరుణానిధి, తాజాగా తిరువారూర్ నియోజకవర్గంలో విజయపు జెండా ఎగురవేసి, అపజయమన్నదే ఎరుగని నేతగా కొనసాగుతున్నారు. అయితే పార్టీ పరంగా ఓటమి చెందడంతో, మరోసారి ప్రతిపక్ష నేతగా పరిమితమవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది.
మరోవైపు 1989 తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి విజయదుందుభి మోగించిన అన్నాడీఎంకే అధినేత్రి ‘అమ్మ’ జయలలిత విజయం వెనుక ఉన్న సీక్రెట్ బయటపడింది. ‘6’ సంఖ్య అంటే జయలలితకు బాగా సెంటిమెంట్ అని, అందుకే పార్టీ మేనిఫెస్టోను 6వ తేదీన ప్రకటించారని, ఎన్నికల నిమిత్తం ప్రజలకిచ్చిన ప్రధాన హామీల సంఖ్య కూడా ఆరేనని మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. కేరళలోని ఒక జ్యోతిష్కుడిని తరచుగా సంప్రదిస్తుంటారని, ఇప్పటివరకు ఐదు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జయలలిత, తాజా ఫలితాలతో ఆరో సారి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం వెనుక ఉన్నది కూడా “6” అని పొలిటికల్ వర్గాల టాక్.
ఇదిలా ఉంటే, విజయాన్ని సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తున్న జయలలితకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, అన్నాడీఎంకే నేతలు ఆప్యాయంగా ‘విప్లవనాయకి’గా పిలుచుకునే జయలలితకు ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ రోశయ్య నుంచి మంత్రుల వరకూ శుభాభినందనలు తెలుపుతున్నారు. జయలలిత మీడియా సమావేశాన్ని ముగించిన తరువాత, ఎంతో మంది నేతలు పుష్పగుచ్ఛాలిచ్చి పాదాభివందనాలు చేయగా, మరికొందరు మాత్రం ఏకంగా సాష్టాంగ నమస్కారాలు చేశారు. అభినందనలను చిరునవ్వుతో స్వీకరించిన జయలలిత ఎంతో సంతోషంగా కనిపించారు.



