జగన్, కేటీఆర్‌… జైలు కోసం తహతహలాడుతున్నారే!

Jagan KTR

ఇదివరకు ఏ పార్టీ అధినేత అయినా అధికారంలోకి రావాలనుకుంటే పాదయాత్రలు చేసేవారు. కానీ ఇప్పుడు పాదయాత్రల కంటే జైలుకి వెళ్ళిరావడమే ‘పవర్ ఫుల్’ అని నేతలు భావిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి, ఏపీలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డి ముగ్గురూ ఆవిదంగా రాజకీయ మైలేజ్ పొందారు. అయితే రేవంత్‌ రెడ్డిని, చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించి వారికి రాజకీయ ప్రయోజనం కల్పించిన పుణ్యం కేసీఆర్‌, జగన్‌లకే దక్కుతుంది.

ADVERTISEMENT

ఈ నేపధ్యంలో రాజకీయ నేతలు జైలుకి వెళ్ళిరావడం చాలా అవసరంగా కూడా మారిందిప్పుడు. ప్రస్తుతం ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్‌ జైలుకి వెళ్ళేందుకు చాలా తహతహలాడుతున్నారు.

ఫార్ములా-1 రేసింగ్ వ్యవహారంలో తాను జైలుకి వెళ్ళేందుకు సిద్దంగా ఉన్నానని, జైల్లో యోగా వగైరా చేసుకొని ‘ఫిట్’గా మారి 2 నెలల్లో బయటకు వస్తానని కేటీఆర్‌ చెప్పుకున్నారు.

తాజాగా వికారాబాద్‌ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో పోలీసులు కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారనే అనుమానంతో హైదరాబాద్‌లో నందినగర్‌లో కేటీఆర్‌ నివాసం వద్ద నిన్న అర్దరాత్రి వరకు బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తల నినాదాలతో హైడ్రామా సాగింది.

ఇక్కడ ఏపీలో వైసీపి సోషల్ మీడియా కార్యకర్తలని పోలీసులు అరెస్టు చేస్తుండటంతో, వైసీపి అధినేత జగన్‌ నిన్న తాడేపల్లి ప్యాలస్‌లో మీడియా సమావేశం నిర్వహించి సిఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.

“మీరు ఇంకా ఎంత మందిని అరెస్ట్ చేసినా మేము మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టాలని ఈ సందర్భంగా నేను పిలుపు ఇస్తున్నాను. ఒకవేళ అరెస్ట్ చేయదలిస్తే నేను కూడా సిద్దంగా ఉన్నాను. నాతోనే అరెస్టులు మొదలుపెట్టమని సిఎం చంద్రబాబు నాయుడుకి సవాలు విసురుతున్నాను,” అని జగన్‌ అన్నారు.

శాసనసభలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని జగన్‌ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే హైకోర్టు చేత ప్రభుత్వానికి ఆదేశం జారీ చేయించి సాధించుకుంటాము తప్ప ఈవిషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని జగన్‌ స్పష్టం చేశారు.

శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతుంటే అనర్హత వేటు వేస్తామని బెదిరిస్తున్నారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయాలని జగన్‌ సిఎం చంద్రబాబు నాయుడుకి సవాలు చేశారు.

ఎన్నికలలో ఓటమితో బిఆర్ఎస్, వైసీపిలు చాలా ఢీలా పడ్డాయి. వాటిని జాకీలు పెట్టి లేపేందుకు వాటి నేతలు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు.

కనుక ఓసారి జైలుకి వెళ్ళివస్తే పార్టీ శ్రేణుల్లో భావోద్వేగాలు రగిలి మళ్ళీ ఉత్సాహంగా పనిచేస్తారని కేటీఆర్‌, జగన్‌ భావిస్తున్నట్లున్నారు?

జైలుకి వెళితే ప్రజలలో సానుభూతి, పార్టీకి రాజకీయ మైలేజ్ లభిస్తుందనే ఓ రాజకీయ ఫార్ములా ఎలాగూ నిరూపితమైంది కనుక ఓసారి వెళ్ళి వస్తే మంచిదని భావిస్తున్నట్లున్నారు.

ఈవిదంగా రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళి రావాలని తహతహలాడుతుండటం, దాంతో కూడా వారికి రాజకీయ మైలేజ్ లభిస్తుండటం చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలీడం లేదు.

ADVERTISEMENT
Latest Stories