జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందువరకు నిత్యం జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతూ, జనం మద్య ఉండేవారు. చాలా కీలకమైన సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలలో అంత చురుకుగా, పదునుగా పనిచేయడం కలిసి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని తపించిపోయిన అభిమానుల కోరిక కూడా ఉప ముఖ్యమంత్రి పదవితో దాదాపు నెరవేరింది.
శాసనసభలో పవన్ కళ్యాణ్ అనర్గళంగా మాట్లాడుతుంటే ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా చూస్తున్నట్లు అభిమానులు ఎంతో మురిసిపోయారు.
అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ క్రమంగా మీడియాకు, ప్రజలకు కనబడటం తగ్గిపోయింది. పోనీ ఆయన, రాజకీయాలలో బ్రేక్ తీసుకొని తన పెండింగ్ సినిమాలు ఏమైనా చేసుకుంటున్నారంటే అదీ చేయడం లేదు.
విదేశాలకు వెళ్ళారా?అంటే అవును తన భార్య అన్నా కోసం సింగపూర్ వెళ్ళారు. కానీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆమె డాక్టరేట్ డిగ్రీ అందుకున్నాక ఇద్దరూ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు.
మరైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? జనానికి, మీడియాకి ఎందుకు కనబడటం లేదు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో జనసేన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది. కానీ అది చివరిగా జూన్ 21న ట్విట్టర్లో కనిపించింది. పవన్ కళ్యాణ్ చివరిసారిగా జూలై 28న ట్విట్టర్లో కనిపించారు. ఆ తర్వాత ఆయనా కనపడలేదు.
పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖల మంత్రిగా కూడా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మంత్రి అయిన తర్వాత ఇంతవరకు ఒక్క గ్రామంలో కూడా పర్యటించలేదు మరైతే ఏం చేస్తున్నారు?
ఏదైనా పని మొదలుపెట్టేప్పుడు దాని గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవడం పవన్ కళ్యాణ్కి అలవాటు. కనుక తన శాఖలు, బాధ్యతలు, అధికారాలు, పనుల గురించి అధ్యయనం చేస్తున్నారా?ఏమో!
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ కూడా నిత్యం స్వయంగా లేదా మీడియా ద్వారా ప్రజలతో టచ్లోనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కాడా? జనసేన పార్టీయే చెప్పాలి.




