జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను దాదాపు ఐదేళ్ల తరువాత జైలు నుంచి బెయిలు మీద బయటకు వచ్చారు. 2019 ఎన్నికల ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై కోడికత్తి తో దాడి చేసి అరెస్టైన శ్రీను 2024 ఎన్నికల ముందు బయటకు రావడం యాదృచ్ఛికమా, ప్రణాళికా అనేది రానున్న కాలంలో తెలియనుంది.
నేను జగన్ అభిమానిని, జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే నేను ఆయన మీద కోడికత్తి తో దాడి చేసాను, తద్వారా జగన్ పట్ల ప్రజలలో సానుభూతి వచ్చి ఓటర్లు ఓటు వేసి ముఖ్యమంత్రి ని చేస్తారు అంటూ చెప్పిన శ్రీను ఇన్నాళ్లకు మీడియా ఎదుటపడ్డారు.
అయితే కేసు విషయమై మీడియాతో మాట్లాడకూడదు అనే ఆంక్షలతో న్యాయస్థానం బెయిలు ఇవ్వడంతో శ్రీను న్యాయవాది మీడియాతో మాట్లాడారు. అయితే జైలు నుండి విడుదలై బయటకు వచ్చిన శ్రీను కి ఆయన కుటుంబానికి భద్రతా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంది అంటూ శ్రీను న్యాయవాది మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తుచేశారు.
అయితే జగన్ ను ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తేనే మారణాయుధాలు తీసుకుని పార్టీ కార్యాలయాల మీద దాడికి వెళ్లే వైసీపీ కార్యకర్తలు వారిని ప్రోత్సహనించే నాయకులు ఉన్న ఈ ప్రభుత్వంలో జగన్ మీద దాడి చేసిన వ్యక్తికీ రక్షణ ఉంటుందా అంటే..? అయితే శ్రీను న్యాయవాది మాత్రం శ్రీను ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత జగన్ దే అని తేల్చేసారు.
రాజ్యాంగ పరంగా ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో అందరి ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత కూడా ఆయనదే అవుతుంది. కాబట్టి కోడికత్తి శ్రీనుకి, ఆ కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగితే దాని పూర్తి బాధ్యత జగన్ దే అంటూ తేల్చేసారు. ఇప్పటికే జగన్ సోదరీమణులు షర్మిల, సునీతా ఈ రాష్ట్రంలో తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సాధారణ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు రక్షణ కల్పిస్తుందో చూడాలి.
వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితే కేసులో ఉన్న అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు శ్రీను ప్రాణాలు ‘గాలి’లో ఉన్నట్టే అంటున్నారు విపక్షాలు.




