కూలుతున్న మూల స్థంభాలు

Peddireddy Ramachandra Reddy ఆసక్తికరంగా ఉండే రాజకీయాలకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్. ప్రత్యర్థి పార్టీల మధ్య ఉండే ఆధిపత్య పోరు అంతా ఇంతా కాదు. ఎత్తులకు పై ఎత్తులు, వ్యూహ ప్రతి వ్యూహాలతో ఓ రణరంగాన్ని తలపించేవిధంగా ఉంటాయనే చర్చ ఢిల్లీ స్థాయిలో ఆంధ్రా రాజకీయాల గురించి జరుగుతున్న పరిస్థితి.

ప్రత్యర్థుల మధ్య బలాబలాలు చూపించుకోవడం సహజం. కానీ సొంత పార్టీలోని కీలక నాయకులే వారి దమ్ము, బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక ఆ పార్టీకి గడ్డుకాలం దాపరించినట్లుగా పరిగణిస్తారు. ఎందుకంటే కొనసాగుతున్న పార్టీలోని కీలక నేతలు వారి నిరసనను మౌనం వహించడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, అలకబూనడం ద్వారా వ్యక్తం చేస్తారు. వారి నిరసనను అధిష్టానం అర్ధం చేసుకుని సరిచేసిందా సరే సరి, లేదంటే వారి అలకతో పార్టీ మనుగడ పతనం దిశగా ప్రయాణిస్తున్నట్లుగా చేస్తుంటారు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట.

ADVERTISEMENT

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులు సైతం ఇవే విమర్శలను మీడియా ముఖంగా చేస్తున్నారు. కానీ ఆ విమర్శలకు ఎక్కడా ఖండన రాకపోవడంతో అవి నిజమేనేమో అనే అనుమానం కూడా విమర్శకుల నుండి వ్యక్తం అవుతుంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ కి అతిపెద్ద మూలస్థంభాల్లో ఒకరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత రెండు సంవత్సరాలుగా మౌనంగా ఉంటున్నారు, కనీసం ఆయన నోరు మెదపడం లేదు అని శ్రీనివాసరావు విమర్శించారు.

నిత్యం చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేసే పెద్దిరెడ్డి కనీసం వారిపై ఒక్క విమర్శ కూడా చేయడం లేదని, అంతేకాకుండా కుప్పంలో బాబుని ఒడిస్తాం అని గతంలో చేసిన విమర్శలు గాని, లోకేష్ పాదయాత్ర పైన విమర్శలు చేయడం గాని, వై నాట్ 175 అనే అంశం గాని.. అసలు ఏ విధమైన విమర్శలు కూడా పెద్దిరెడ్డి చేయడం లేదని, పెద్దిరెడ్డి అమరావతి రావడమే మానేశారని, దీనికి కారణం జగన్ తో విబేధాలు తలెత్తడమేనని కొలికపూడి అన్నారు. పెద్దిరెడ్డి జగన్ వ్యవహరశైలితో విసిగిపోయి మౌనంగా ఉంటున్నారని విమర్శించారు కొలికపూడి.

ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయిన పరిస్ధితి. ఇక తాజాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ కూడా వైసీపీకి తీవ్ర నష్టం కల్పించే అంశంగానే విమర్శకులు, విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు ప్రస్తుతం పెద్దిరెడ్డి మౌనం కూడా చర్చనీయాంశం కావడంతో ఏమి జరగబోతుంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మౌనం పై కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు అటు పెద్దిరెడ్డి వర్గం నుండి కానీ, వైసీపీ పార్టీ నుండి కానీ, ఎలాంటి ఖండన రాకపోవడంతో విమర్శకుల వ్యాఖ్యలకు మరింత బలం చేకూరినట్లయ్యిందని ప్రజల నుండి వస్తున్న స్పందన.

కష్ట కాలంలో జగన్ కి అండగా ఉండి నడిచిన కీలకనేతలు ఒక్కొక్కరిగా పార్టీకి దూరం అవుతుండటం తో వైసీపీకి కష్టకాలం మొదలయ్యింది అనే విమర్శలు సామాన్య ప్రజల నుండే వినిపిస్తున్నాయి.

వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయులుగా ఉన్న నేతలను దూరం చేసుకుంటే చివరికి జగన్ ఒంటరవడం ఖాయం అని వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories